అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను తప్పుబడుతూ ఇచ్చిన మ‌ధ్యంత‌ర బెయిల్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేసింది. వివేకా హ‌త్య కేసులో హైకోర్టు అవినాష్ రెడ్డికి ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డంపై వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.
 
దీనిపై ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్త‌ర్వుల‌ను ర‌ద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాదు విచారణను లిఖిత పూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టు ప్రాధమిక స్థాయిలో ఎలా జోక్యం చేసుకుంటుందని సిజెఐ ప్రశ్నించింది.
సిబిఐ పని కూడా హైకోర్టు చేస్తే ఎలా అని సిజెఐ డివై చంద్రచూడ్ అడిగారు. ఈ కేసులో మాత్రమే హైకోర్టు ఎందుకు ఇలా వ్యవహరించిందని అడిగింది. ప్రశ్నోత్తరాల ప్రింటెంట్ పార్మాట్‌లో ఇవ్వాలని హైకోర్టు ఎలా చెబుతోందని సిజెఐ ప్రశ్నించింది. ఇలా ఉండగా,  ఏప్రిల్-30 వరకూ విచారణ ముగించాలని గతంలో గడువిచ్చిన సుప్రీం.. ఇప్పుడు పెంచింది.
జూన్-30 లోపు విచారణ పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. హైకోర్టు బెయిల్‌పై తేల్చేంతవరకు అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరఫు న్యాయవాది కోరగా  ఈ విజ్ఞప్తిని సుప్రీం అంగీకరించలేదు.  సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరెందుకు ఊహించుకుంటున్నారు..? అని అవినాష్ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది.
సీబీఐ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో చేసుండేది కదా..? అని ఒకింత కోర్టు మండిపడింది. ఈ కేసులో సీబీఐ పూర్తి సంయమనంతో ఉందని కోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ సంగతేంటో తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. అవినాష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు త‌ప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయ‌ని, అంతేకాదు ద‌ర్యాప్తును కూడా ప్రభావితం చేసేలా ఉన్నాయ‌న్న సీజేఏ ధర్మాసనం చెప్పుకొచ్చింది.
మరోవైపు ఈ కేసులో సీబీఐ ఈమధ్య అరెస్టు చేసిన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి నుంచి ఐదు రోజుల పాటూ సీబీఐ కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం వీరిద్దరు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. వీరిని సీబీఐ ఏరోజుకారోజు కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. విచారణ మొత్తాన్నీ ఆడియో, వీడియో రికార్డ్ చేస్తోంది. నేటితో వీరి విచారణ ముగియనుంది.