హిందువులకు పవిత్రమైన చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. శనివారం అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్త్ర కాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల తరుపులు తెరుచుకోవడంతో ఈ యాత్ర ప్రారంభమైనట్లయింది. మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి ఆలయం తలుపులు తెరవగా, 12.41 గంటలకు యమునోత్రి ఆలయం తలుపులను తెరిచారు. చార్ధామ్లో భాగమైన మరో రెండు ఆలయాలు కేదార్నాథ్ ఆలయాన్ని ఈ నెల 25న, బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 27న తెరుస్తారు.
శనివారం గంగోత్రి ఆలయం తలుపులు తెరవడానికి ముందు గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గంగోత్రిధామ్ పోర్టల్ను ప్రారంభించారు. అనంతరం యమునోత్రి ఆలయం తలుపులు తెరిచారు. చార్ధామ్ యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి ధామి భక్తులకు పుష్పవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
శీతాకాలంలో ఆరు నెలల పాటు మూసి ఉంచిన హిమాలయాల్లోని ఈ ఆలయాలను భక్తుల సందర్శన కోసం ఇప్పుడు తెరిచారు. యాత్ర సందర్భంగా గంగాడోలి ముఖ్బా గ్రామంలో శుక్రవారం ఆర్మీబ్యాండ్ మేళాలతో గంగోత్రిధామ్కు బయలుదేరింది. ఈ సందర్భంగా గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు.
డోలీపై పూలవాన కురిపిస్తూ వీడ్కోలు పలికారు. అనంతరం పల్లకీ సేవతో కాలినడకన గంగోత్రి హైవే చేరుకుని, అక్కడినుంచి బైరో వ్యాలీకి చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకుని శనివారం ఉదయం 8 గంటలకు ధామ్కు బయలుదేరింది. భక్తులకు ముఖ్యమంత్రి దామి స్వాగతం పలుకుతూ, ఎలాంటి ఇబ్బందీ లేకుండా యాత్ర కోసం రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
కాగా హిమాలయాల్లోని ఈ నాలుగు ఆలయాలను సందర్శించే రోజువారీ భక్తుల సంఖ్యపై ఆంక్షలు విధించాలన్న నిర్ణయాన్ని సైతం ముఖ్యమంత్రి శుక్రవారం ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే యాత్ర కోసం 16 లక్షల మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారని, ఈ సంఖ్య మరింత పెరుగుతోందని సిఎం చెప్పారు.
More Stories
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆగని మంటలపై `సుప్రీం’ మండిపాటు
ఎన్నికల వేళ పాక్ సరిహద్దులో 49 డ్రోన్లు స్వాధీనం
విపత్తుల ఫలితంగా భారత్ లో 5 లక్షల మంది నిరాశ్రయం