ఆధార్ ధృవీకరణలో ప్రైవేటుకూ అనుమతి

దేశ పౌరుల విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్‌ వివరాలను వాడుకొనే అధికారం ఇప్పటివరకు ప్రభుత్వశాఖలకు మాత్రమే ఉంది. అయితే, ఆ పరిధిని విస్తృతం చేస్తూ ప్రైవేటు సంస్థలు కూడా ఆధార్‌ను వాడుకొనేందుకు అవకాశం కల్పించేలా చట్టంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.  ప్రజా సంక్షేమం, సుపరిపాలన వ్యవహారాల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

ఇకపై దీనిని ప్రైవేటు సంస్థలు కూడా చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. సంబంధిత విధివిధానాలు రూపొందించింది.  ప్రభుత్వరంగం నుంచి అందే వివిధ ప్రయోజనాలు లబ్థిదారులకు అందేందుకు, సబ్సిడీలకు, సేవలకు తప్పనిసరిగా పౌరుల ఆధార్‌కార్డుల ధృవీకరణ అవసరం.

ఇప్పటివరకు ఆధార్ సంబంధిత అధీకృత సంస్థ యుఐడిఎఐ ప్రతిరోజూ 7 నుంచి 8 కోట్ల వరకూ ఆధార్‌కార్డుల ధృవీకరణ చేపడుతోంది. ఆధార్ ధృవీకరణల తరువాత పౌరులకు అందే ప్రయోజనాలలో అత్యధిక శాతం అంటే 20 శాతం వరకూ ఆహార ధాన్యాల సరఫరా (పిడిఎస్) ఖాతాలో ఉంది. తర్వాత టెలికం రంగంలో 6 శాతం వరకూ సేవలు ఈ ప్రక్రియతో అందుతాయి.

 కేంద్ర సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధార్ చట్టానికి ప్రతిపాదించిన సవరణల మేరకు ఇకపై ప్రైవేటు సంస్థలు కూడా తగిన లైసెన్సులు పొందడం ద్వారా అథెంటికేషన్ ప్రక్రియను చేపట్టేందుకు వీలేర్పడుతుంది.  మంత్రిత్వ శాఖ తన ప్రతిపాదనపై పౌరులు తమ స్పందనను వచ్చే నెల 5 లోగా పంపించాలని ప్రకటించారు. మైగవ్ వెబ్‌సైట్‌కు వీటిని చేరవేయవచ్చునని తెలిపారు.