81 ఏళ్ళకు వెయ్యికి పైగా యుద్ధ ఖైదీలతో మునిగిన నౌక ఆచూకీ

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెయ్యి మంది యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగిపోయిన ఎస్‌ఎస్‌ మాంటెవీడియో మారు అనే జపాన్‌ నౌకను ఎట్టకేలకు గుర్తించారు. జులై 1, 1942 సంవత్సరంలో పాపువా న్యూ గినియా నుండి చైనాలోని హైనాన్‌కు వెళ్లే మార్గంలో అమెరికా జలాంతర్గామి దాడి చేయడంతో ఈ నౌక ముగిసిపోయింది.
 
మిస్టరీగా మిగిలిపోయిన ఈ ఘటన జరిగిన 81 ఏళ్ల తర్వాత ఈ నౌకను గుర్తించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ శనివారం వెల్లడించారు. ఈ నౌకను ఫిలిప్పీన్స్‌లోని లుజోన్‌ ద్వీపతీరంలో దక్షిణ చైనా సముద్రంలో 4 వేల కిలోమీటర్ల లోతులో ఈ నౌకను గుర్తించినట్లు సముద్ర పురావస్తు గ్రూపు సైలెంట్‌వరల్డ్‌ ఫౌండేషన్‌ తెలిపింది.
 
సముద్ర సర్వే సంస్థ ఫుగ్రోతో కలిసి ఆస్ట్రేలియన్‌ మిలిటరీ సహాయంతో ఈ నౌకను ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి వెతకడం ప్రారంభించారు. సముద్రంలో హైటెక్‌ పరికరాలను ఉపయోగిచారు. 12 రోజుల తర్వాత నౌక చిత్రాలను లభ్యమయ్యాయి. మాంటెవీడియో మారు నౌక మునిపోవడం ఆస్ట్రేలియా ఘోరమైన సముద్ర విపత్తుగా నిలిచింది.  ఈ నౌకలో 850 మంది సైనికులతో సహా 979 మంది ఆస్ట్రేలియన్‌ పౌరులు, 13 ఇతర దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. మొత్తంగా 1,060 ఖైదీలు జలసమాధి అయ్యారు.
 
నౌక గుర్తింపుపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ ‘చివరికి మాంటెవీడియా మారు నౌకను కనుగొనడం జరిగింది. ఇందులో 1,060 మంది ఖైదీలలో 850 ఆస్ట్రేలియన్‌ సర్వీస్‌ సభ్యులు ఉన్నారు. దీంతో మన దేశానికి సేవ చేసిన వారిని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుని, గౌరవించాలనే సూచికగా ఈ మాంటెవీడియో నౌక నిదర్శనంగా నిలుస్తుంది’ అని ట్వీట్‌ చేశారు.
 
ఈ నౌక కనుగొనడం పట్ల సైనికుల కుటుంబాలకు కొంత ఓదార్పునిచ్చేదిగా ఈ వార్త నిలుస్తుందని ఆంథోనీ చెప్పారు. ‘ఆస్ట్రేలియా సముద్ర చరిత్రలో చీకటి అధ్యాయం ఒకటి ముగిసింది. మాంటెవీడియో నౌక కనుగొనడం పట్ల చనిపోయిన సైనిక కుటుంబాలకు ఇప్పటివరకు ఉన్న అసంపూర్తి తొలగిపోతుంది’ అని ఆస్ట్రేలియా రక్షణ శాఖా మంత్రి రిచర్డ్‌ మార్లెస్‌ వీడియో సందేశంలో తెలిపారు.