పధకాలు చివరి లబ్దిదారు వరకు చేరడమే కీలకం

మన పథకాలు ఎంత గొప్పవైనప్పటికీ, కాగితాలపై అవి ఎంత మంచిగా కనిపించినప్పటికీ, అవి చివరి లబ్దిదారు వరకు చేరడమే ఒక నిర్ణయాత్మకమైన అంశంగా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. విజ్ఞాన్‌ భవన్‌లో 16వ సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని సివిల్‌ సర్వెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు.
గత తొమ్మిది సంవత్స రాల్లో దేశంలో నిరుపేదలు సత్‌ పరిపాలన పట్ల విశ్వా సాన్ని పొందారంటే దాని వెనుక మీరు పడిన కష్టం ఉందని, మీరు  భాగస్వామ్యంతోనే గత తొమ్మిది సంవత్సరాల్లో భారత్‌లో అభివృద్ధి జోరందుకుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కరోనా సంక్షోభా న్ని చవిచూసినప్పటికీ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిం చిందని ఆయన చెప్పారు.

”ఒక రాజకీయ పార్టీ పన్ను చెల్లింపుదారుల ద్వారా వచ్చిన సొమ్మును తన పార్టీ ప్రయోజనం కోసం వాడుకుంటున్నదా? లేక దేశం కోసం వినియోగిస్తున్నదా? అని అధ్యయనం చేయాల్సిన బాధ్యత అధికారస్వామ్యం(బ్యూరోక్రసీ) పై ఉంది” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

”ఒక అభివృద్ధి చెందిన భారత్‌ కోసం సామాన్య ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వ వ్యవస్థ అండగా ఉండాలి. మొదట్లో ప్రభుత్వం ప్రతీదీ చేస్తుందనే ఆలోచనా ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్నదనే ఆలోచనా ధోరణి ఏర్పడింది” అని అధికారస్వామ్య వైఖరిలో వచ్చిన మార్పును ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు.
ప్రతి ఒక్కరి సమయం, వనరులను సమర్థమంతంగా వినియోగించుకోవడం ద్వారా అందరికీ సేవ చేయాలని ఒక దృక్కోణంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రధాని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో చేపట్టిన విధానాలు, వారసత్వ రాజకీయాలు ఒక అవినీతికరమైన వాతావరణానికి దారి తీశాయని ప్రధాని  మోదీ విమర్శించారు.
గత ప్రభుత్వాల హయాంలో చేపట్టిన విధానాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలను ప్రధాని ప్రస్తావించారు. ఆ విధానాల పుణ్యామాని నాలుగు కోట్లకు పైగా నకిలీ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని, నాలు గు కోట్లకు పైగా నకిలీ రేషన్‌ కార్డులు మంజూ రయ్యాయని ఎద్దేవా చేశారు.  కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా కాగితం మీద మాత్రమే కనిపించే కోటి మంది మహిళలు, పిల్లలకు ప్రయోజనాలు అందాయని ప్రధాని ఆరోపించారు. ఆఖరికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా దాదా పు 30 లక్షల మంది యువతకు నకిలీ ఉపకారవేతనాలు అందాయని ఆయన పేర్కొన్నారు.
 
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీ ఎన్‌ఆర్‌యీజీఏ) కింద అసలు ఉనికిలో లేని కార్మికులకు ప్రయోజనాలు బదలీ చేయడం కోసం లక్షలాదిగా నకిలీ ఖాతాలు సృష్టించారని ప్రధాని నిందించారు. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను అనర్హులకు దక్కకుండా కాపాడడంలో చురుకైన పాత్ర పోషించారంటూ వారిని ప్రధాని అభినందించారు. అలా ఆదా చేసిన అంత పెద్ద మొత్తాన్ని ప్రస్తుతం పేదల సంక్షేమం కోసం వినియోగిస్తున్నట్టు తెలిపారు.