సంజయ్​ బెయిల్​ రద్దు పిటిషన్ ​తిరస్కరణ

పదో తరగతి హిందీ పేపర్​ లీక్​ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ​బండి సంజయ్ బెయిల్ ​రద్దు పిటిషన్​ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో  ఏ1 గా ఉన్న బండి సంజయ్​తో పాటు ఏ2, ఏ3, ఏ5లకు కోర్టు ఇదివరకే బెయిల్ ఇచ్చింది.  అయితే, బండి సంజయ్​ బెయిల్ ​కండీషన్స్ ​పాటించడం లేదని, తన సెల్​ఫోన్​ పోలీసులకు అప్పగించకుండా విచారణకు సహకరించడం లేదని, అందుకే ఆయన  బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం తరఫున పబ్లిక్​ ప్రాసిక్యూటర్ ​ సోమవారం ప్రిన్సిపల్ ​డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జి వద్ద  పిటిషన్ ఫైల్​చేశారు.

బీజేపీ నిరుద్యోగ మార్చ్ లో కూడా బెయిల్ ​రూల్స్ కు విరుద్ధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పిటిషన్​ లో పేర్కొన్నారు. బండి సంజయ్​కి బెయిల్ మంజూరు చేసిన ఫోర్త్​ ఎంఎం కోర్టులోనే పిటిషన్​ దాఖలు చేసుకోవాలని పిటిషన్ ను కోర్టు అదే రోజు తిరస్కరించింది.  దీంతో మంగళవారం ఫోర్త్​ మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పిటిషన్ ​దాఖలు చేయగా అందులో పేర్కొన్న ప్రొవిజన్లతో కోర్టు విభేదించింది. బెయిల్​ ఎందుకు రద్దు చేయాలో చెప్పే సెక్షన్లను సరిగ్గా పేర్కొనలేదని పిటిషన్​ తిరస్కరించింది.

అయితే.. పిటిషన్ లో మళ్లీ మార్పులు చేసి సబ్మిట్ చేసేందుకు సర్కారు సిద్ధమవుతుండగా, అనుకూలంగా తీర్పు రాకపోతే హై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. పడవ తరగతి  హిందీ పేపర్ లీకేజీ కేసులో కోర్టు మరో ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది.

ఇప్పటికే రెండు రోజుల పోలీస్​ కస్టడీని ఎదుర్కొన్న ఏ6 వర్షిత్​తో పాటు మరో నిందితుడు ఏ9 సుభాష్ కు బెయిల్​ఇవ్వాలని ఫోర్త్​ మెట్రోపాలిటన్​ మెజిస్ట్రేట్​ కోర్టులో డిఫెన్స్ ​లాయర్లు సోమవారం పిటిషన్​ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ ​మంజూరు చేసింది.  ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు స్థానిక  పోలీస్​స్టేషన్​లో హాజరై సంతకం పెట్టడంతో పాటు పోలీసుల విచారణకు సహకరించాల్సిందిగా కోరింది. కాగా, ఈ కేసులో  ఏ7, ఏ8 ఇంకా రిమాండ్​లోనే ఉన్నారు.