చరిత్రలో తొలిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవం

ఎంతో చైతన్యవంతమైన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కళల కొనసాగింపునకు, వైవిధ్యమైన మన వారసత్వ సంపద పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం విరివిగా నిధులను కేటాయించి వాటిని భవిష్యత్ తరాలకు అందించటానికి ఎంతగానో కృషి చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు.

 ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా చరిత్రలో తొలిసారి ‘తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను’ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా, అట్టహాసంగా నిర్వహించిందని కిషన్ రెడ్డి ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా గుర్తుచేశారు.  తెలంగాణలోని చారిత్రక సంపద పరిరక్షణకు, ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాల కొనసాగింపునకు గత 9సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 610 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు.

అంతేకాకుండా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ నినాదాన్ని ప్రతిబింబిస్తూ వరంగల్, హైదరాబాద్ నగరాలలో ఎంతో ఘనంగా ‘రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్’ వేడుకలను నిర్వహించినట్టు తెలిపారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ – పైగా టూంబ్స్ – హయత్ బక్షి మసీదు – రేమండ్స్ టూంబ్స్ ను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ అభివృద్ధి కోసం స్వదేశ్ దర్శన్ పథకం కింద ఆయా వారసత్వ సంపదల పరిరక్షణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

‘ములుగు – లక్నవరం – మేడవరం – తాడ్వాయి – దామరవాయి – మల్లూరు – బొగత జలపాతం’లను కలుపుతూ గిరిజన సర్క్యూట్ పేరుతో ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించామని చెప్పారు. గిరిజన సమాజం కూడా నిరంతరం ప్రకృతితో మమేకమై.. మన జీవన విధానం ఇలాగే ఉండాల్సిన అవసరాన్ని మనకు అనునిత్యం గుర్తుచేస్తోందని తెలిపారు.

 పర్యావరణం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు గిరిజనుల జీవనం ద్వారా అందుతున్న సందేశం, తదితర అంశాలను వివరిస్తూ తీసుకొచ్చిన ట్రైబల్ సర్క్యూట్ వంటివి  సుస్థిర పర్యాటకానికి కూడా బాటలు వేస్తున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు.

సోమశిల, సింగోటం, కదళీవనం, అక్కమహాదేవి, ఈగలపెంట, ఫరాహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం మధ్య ఎకో-సర్క్యూట్ అభివృద్ధి కోసం స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించామని తెలిపారు. గోల్కొండ కోటకు సౌండ్, ఇల్యుమినేషన్, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు.

ఉస్మానియా యూనివర్సిటీలో సౌండ్, ఇల్యుమినేషన్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటవుతోంది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ ను నాటి చరిత్రకు ప్రతిబింబంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో ‘ఎపిగ్రఫి మ్యూజియం’ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చార్మినార్ నిర్వహణ కోసం పురావస్తు శాఖ ద్వారా పనులు జరుగుతున్నాయని, అలాగే హైదరాబాద్‌లో ‘కొమురం భీమ్ గిరిజన మ్యూజియం’ను ఏర్పాటు చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ పట్టణానికి హెరిటేజ్ సిటీ గుర్తింపునిస్తూ పట్టణంలోని వారసత్వ సంపద పరిరక్షణకు చర్యలు చేపట్టామని, వరంగల్ కోటలో సౌండ్, ఇల్యుమినేషన్, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని కిషన్ రెడ్డి వివరించారు. హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో భారత పురావస్తు శాఖ ద్వారా మంటపాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు.

తెలంగాణలోని రామప్ప ఆలయం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు సాధించటానికి నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని గుర్తుచేశారు. ప్రసాద్ పథకం క్రింద, భారత పురావస్తు శాఖ ద్వారా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

శక్తి పీఠమైన ఆలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయాన్ని కూడా ప్రసాద్ పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ, బోనాలు తదితర పండుగల వేడుకల నిర్వహణ కోసం, లక్షలాదిమంది గిరిజనులు ఎంతో వైభవంగా జరుపుకునే మేడారం జాతర నిర్వహణ కోసం, యాత్రికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తనవంతు పాత్ర పోషించిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పర్యావరణం కోసం జీవనశైలిలో మార్పు’ కూడా గిరిజనుల జీవన విధానం నుంచి స్ఫూర్తి పొంది రూపొందించినదేనని తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ వారసత్వ దినోత్సవం ఇతివృత్తమైన ‘హెరిటేజ్ ఛేంజెస్’ కూడా ఈ అంశాన్నే ప్రతిబింబిస్తోంది. అంతేకాకుండా, నాగార్జున సాగర్ లో బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రం నిధులు అందజేసిందని పేర్కొన్నారు. 

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివిధ సంగీత, నాటక, నాట్య కళలను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ నగరంలో సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరానని కిషన్ రెడ్డి తెలిపారు.

దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు హైదరాబాద్ నగరంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్న ‘సైన్స్ సెంటర్’ ప్రాజెక్టుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుతూ పలుమార్లు లేఖలు కూడా రాశానని గుర్తుచేశారు.

ఈ రెండు విషయాలలో తెలంగాణ ప్రభుత్వం ఎంత త్వరగా స్పందిచి సహకరిస్తే, అంత త్వరగా ఆయా ప్రాజెక్టులను ప్రారంభించటానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.