యుపిలో మాఫియా, నేరస్థులు ఎవ్వరిని భయపెట్టలేరు

ఉత్తర ప్రదేశ్ లో శాంతిభద్రతలకు పూర్తి భరోసా ఇస్తూ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలెవరిని మాఫియా లేదా నేరస్తులెవ్వరు భయపెట్టలేరని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ గత వారం హత్యకు గురైన తర్వాత మొదటిసారిగా గోరఖపూర్ లో ఒక కార్యక్రమంలో మాఫియా గురించి ఆయన ప్రస్తావించారు.

దోపిడీలు, బెదిరింపులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గ్యాంగ్‌స్టర్లు ఇప్పుడు ప్యాంట్లు తడుపుకుంటున్నారని  ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మాఫియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేదని, పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వ్యాపారవేత్తలను అపహరించడం చేసేవారని ఆయన గుర్తుచేశారు.

గోరఖ్‌పూర్‌లో బాటిలింగ్ ప్లాంట్‌కు భూమి పూజ చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ గతంలో శాంతి భద్రతలను గౌరవించని వారు ఇప్పుడు ప్రాణాల కోసం పరిగెడుతుండడాన్ని ప్రజలు గమనిస్తున్నారని కోరారు. ఆరేళ్ల క్రితం వరకు  మాఫియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేదని, పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వ్యాపారవేత్తలను అపహరించడం చేసేవారని ఆయన గుర్తుచేశారు. 

ఉత్తరప్రదేశ్​లో  ఏ మాఫియా, గ్యాంగ్‌స్టర్‌ల గురించి భయపడాల్సిన అవసరం లేదని,  ఇకపై ఏ పారిశ్రామికవేత్తను ఫోన్‌లో బెదిరించలేరని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. 2014కు ముందు రాష్ట్రంలో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా ఉండేవంటూ గతంలో హింసాత్మక సంఘటనలు నిత్యం  ఎక్కడొకచోట జరిగి అల్లర్లు చెలరేగేవని యూపీ సీఎం యోగి పేర్కొన్నారు.

“2012 నుండి 2017 వరకు రాష్ట్రంలో ప్రతి రెండో రోజూ ఎక్కడో ఒకచోట అల్లర్లు జరుగుతుండెడివి. ఆ సమయంలో మొత్తం 700కు పైగా అల్లర్లు జరిగాయి. కానీ 2017 నుండి 2023 వరకు రాష్ట్రంలో ఒక్క చోట కూడా అల్లర్లు జరగలేదు. ఒక్క రోజు కూడా ఎక్కడా కర్ఫ్యూ విధించే అవసరం రాలేదు” అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

2017 నుంచి 2023 మధ్య ఉత్తరప్రదేశ్‌లో ఒక్క అల్లర్ల ఘటన కూడా జరగలేదని స్పష్టం చేశారు. యూపీలో  జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం యోగి మాట్లాడుతూ గంగా ఎక్స్‌ప్రెస్‌వే పనులు కొనసాగుతున్నాయని, 2025 కుంభమేళా కంటే ముందే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భరోసా ఇచ్చారు.  ఉత్తరప్రదేశ్ ఇప్పుడు 4-లేన్ ఇంటర్‌స్టేట్ కనెక్టివిటీని కలిగి ఉందని యోగి తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారిందని, ఇప్పుడు అన్ని జిల్లాలకు 24X7 విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. రైల్వే ఫ్రైట్ కారిడార్ ఉత్తరప్రదేశ్ గుండా వెళుతుండగా, రాష్ట్రం నుంచి ఎగుమతులు రూ. 1.75 లక్షల కోట్లకు పెరిగాయని సీఎం యోగి తెలిపారు.