ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఢిల్లీలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్

బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్న దేశాలతో సాంస్కృతిక, దౌత్య సంబంధాల బలోపేతం కోసం ‘గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ – 2023’ను ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఢిల్లీలో నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. బౌద్ధమతం భారతదేశంలో పుట్టి వివిధ దేశాలను విస్తరించిందని, అలాంటి దేశాలతో మనకున్న సాంస్కృతిక సారూప్యతను కాపాడుకుంటూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ఆయన తెలిపారు.

భారతదేశం బౌద్ధమతానికి సంబంధించి తొలిసారి ఇంత పెద్ద ఉత్సవం నిర్వహిస్తోందని చెబుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బౌద్ధమతం చూపించే మార్గం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో 30 దేశాలనుంచి బౌద్ధ సన్యాసులు, బౌద్ధ మతాన్ని ఆచరించే ప్రముఖులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, అంబాసిడర్లు తదితరులు పాల్గొంటారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

 
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర క్షేత్రాల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడంతోపాటు, ఆయా ప్రాంతాలకు అనుసంధానతను పెంచుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. బుద్ధుడి మహాపరినిర్వాణం జరిగిన కుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గతేడాది మోదీ ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
 
దీంతోపాటుగా బౌద్ధమతానికి సంబంధించి కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ డీమ్డ్ యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు తదితర కేంద్రాల ద్వారా పాలీతోపాటు వివిధ భాషల్లో ఉన్న బౌద్ధ మత గ్రంథాలను డిజిటైజేషన్ చేస్తున్నామని చెప్పారు.  దీనికితోడు బుద్ధుడు జన్మించిన ప్రాంతమైన నేపాల్ లోని లుంబినిలో అత్యాధునిక వసతుల కల్పన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ సదస్సును నిర్వహించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. కరోనా కారణంగా ఆలస్యమైందని పేర్కొన్నారు.