తిరుమల భక్తులకు రాగి, స్టీల్‌ వాటర్ బాటిల్స్

ఇప్పటికే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించిన టీటీడీ తాజాగా భక్తులకు రాగి, స్టీల్‌ వాటర్ బాటిల్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీ పద్మావతి విచారణ కేంద్రంలో రాగి వాటర్‌ బాటిల్‌కు రూ.450, అదే స్టీల్‌ వాటర్‌ బాటిల్‌కు రూ.200లకు అందిస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే తిరుమల వ్యాప్తంగా విచారణ కేంద్రాల్లో బాటిళ్ల అమ్మకాలను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు తిరుమలలో మే 14 నుంచి 18 వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.  ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఎస్‌విబిసి, ఇంజినీరింగ్, శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. 

ఆకాశ గంగ వద్ద ఐదు రోజుల పాటు శ్రీ హనుమంతుని జన్మ విశేషాలు, ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయాలని సూచించారు.  తిరుమల వేద విజ్ఞాన పీఠంలో అఖండ పారాయణంతో పాటు, యాగం నిర్వహించేందుకు పండితులను ఆహ్వానించాలని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్‌ఎస్ అవధానిని ఆయన ఆదేశించారు. ధర్మగిరితో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయనాల్లోని వేదపండితులు పాల్గొనాలని కోరారు.

అఖండ పారాయణం మే 16న ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేద పండితుల సమూహంగా పటిస్తారని తెలిపారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.

భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి ఆకాశ గంగ, నాద నీరాజనం వేదికలపై ప్రతిరోజూ అన్నమాచార్య, దాససాహిత్య, హెచ్‌డిపిపి ప్రాజెక్టు కళాకారులచే ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మరోవైపు తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్ట కాంప్లెక్స్‌లలో పాదరక్షలు భద్రపరచు కౌంటర్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. తిరుమలకు విచ్చేసే భక్తుల పాదరక్షల భద్రపరచడానికి టిటిడి పది ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం వద్ద 1187 ర్యాక్‌లు, ప్రధాన కల్యాణ కట్ట వద్ద 4 వేల ర్యాక్‌లను భక్తుల కోసం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. త్వరలో పిఎసి – 1,2,3, నారాయణగిరి క్యూ లైన్లు, రాంభాగీచా, సుపదం, ఏటీసీ సర్కిల్, వీక్యూసీలో పాదరక్షల భద్రపరుచు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు వివరించారు.