ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత దేశం అందిస్తున్న మానవతా సాయాన్ని మరింత పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన లేఖ రాశారని కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. రష్యా దురాక్రమణతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని జెలెన్ స్కీ ఆ లేఖలో పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం అందిస్తున్న మానవతా సాయానికి కృతజ్ఞలు తెలిపిన జెలెన్ స్కీ ఈ సాయాన్ని మరింత పెంచాలని కోరారు. మన దేశ పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ మంత్రి ఎమినె జపరోవా ఈ లేఖలను విదేశాంగ శాఖ సహాయక మంత్రి మీనాక్షీ లేఖికి అందజేశారు.
రష్యా దురాక్రమణతో దెబ్బతిన్న తమ దేశాన్ని ఆదుకోవాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, మందులు, వైద్య పరికరాలు, తదితర అత్యవసర వస్తువులను మరింత ఎక్కువగా పంపించాలని కోరారని మీనాక్షీ లేఖి చెప్పారు.
దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని, సాయాన్ని మరింత పెంచాలని సూచించారని మంత్రి చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్ నుంచి ఎమినే జపరోవా మరింత సహకారాన్ని కోరారు.
ప్రధాని మోదీ, ఇతర ఉన్నతాధికారులు తమ దేశంలో పర్యటించాలని కోరారు. అయితే.. ఇతర దేశాలతో భారత్కు ఉన్న సంబంధాల విషయంలో సూచనలు చేసే స్థితిలో తమ దేశం లేదని ఆమె స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటోన్న విషయం తెలిసిందే. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఈ దిగుమతులు పెరిగాయి.
More Stories
కేజ్రీవాల్ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే!
ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్ పిఎ దాడి!
కొత్త ప్రభుత్వానికి 100 రోజుల మాస్టర్ ప్లాన్!