రానున్న ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లతో హ్యాట్రిక్ విజయం

బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు గెలుచుకుని మూడోసారి అధికారాన్ని దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

అస్సాంలోని డిబ్రూగఢ్‌ జిల్లాలో బీజేపీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తూ అస్సాంలోనూ 14 లోక్‌సభ స్థానాలకు గానూ 12 స్థానాల్లో గెలుస్తామని స్పష్టం చేశారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలు కాంగ్రెస్‌ కు కంచుకోటగా ఉండేవని, కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసిందని తెలిపారు.

మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు. మరో రెండు రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 1958 నాటి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టంను తొలగించిన తర్వాత అస్సాంలో శాంతి సామరస్యాలు నెలకొన్నాయని తెలిపారు. భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఘనత ప్రధాని మోదీదే అని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదాన్ని అంతం చేసి, అభివృద్ధిని వేగవంతం చేశారని వివరించారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 50 సార్లు పర్యటించి అనేక రకాల పథకాలు తీసుకొచ్చారని అమిత్ షా గుర్తుచేశారు.

అంత మంచి పనులు చేసిన ప్రధానిపై కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని కోసం ఈ కాంగ్రెసోళ్లు సమాధి తవ్వుతారట అని ఎద్దేవా చేశారు. ‘మోదీ తేరీ కబ్ర్ ఖుదేగీ’ కామెంట్స్‌పై అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తున్నారని స్పష్టం చేశారు.

‘మీరు ఎంత తిడితే.. కమలం అంతగా వికసిస్తుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరూ చూశారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజల మద్దతు లభించింది’ అని అమిత్ షా స్పష్టం చేశారు.  గతంలో ఆందోళనలు, తీవ్రవాదానికి మారుపేరుగా ఉంటే, ఇప్పుడు బిహూ సంగీతంపై నృత్యాలు చేస్తున్నారని షా చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీ  భారత్‌ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసినా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు పట్టించుకోలేదని  అమిత్‌షా గుర్తు చేశారు. లండన్ లో రాహుల్‌ గాంధీ భారత్‌ను అవమానపరిచారని ఆయన మండిపడ్డారు.  రాహుల్ ఇలాగే ప్రవర్తిస్తే   దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌  తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అమిత్ షా హెచ్చరించారు. 

ప్రధాని నరేంద్ర మోదీపై పైఎన్ని ఎక్కువ విమర్శలు చేస్తే అదే స్థాయిలో బీజేపీ  వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 1980లో రెండు లోక్‌సభ సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం 2019 ఎన్నికల్లో 303 సీట్లకుకు చేరుకుందని గుర్తు చేశారు. తొలిసారిగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోడ్  పోటీ చేయగా ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కంటే 10  స్థానాలను ఎక్కువ సాధించింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 7.74 శాతం ఓట్లను సాధించగా,  2014లో 31.34 శాతం ఓట్లను దక్కించుకుంది. ఇక 2019 ఎన్నికల్లో 37.46 శాతానికి పెంచుకుంది.