అత్యంత నిరాశాజనకంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. లోక్ సభ, రాజ్యసభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే, ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత నిరాశాపూరిత ఫలితాలను ఇచ్చాయని కేంద్రం వ్యాఖ్యానించింది. ఈ బడ్జెట్ సమావేశాల ఉత్పాదకత చాలా తక్కువగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ విచారం వ్యక్తం చేశారు.

మొత్తం బడ్జెట్ సమావేశాల్లో లోక్ సభ ఉత్పాదకత 34% కాగా, రాజ్యసభ ఉత్పాదకత 24.4% అని తెలిపారు. ఈ సమావేశాల్లో మొత్తం 6 బిల్లులు ఉభయ సభల ఆమోదం పొందాయని, మొత్తం 8 బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టామని వెల్లడించారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 వ తేదీన ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13 వరకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు బడ్జెట్ ను అధ్యయనం చేయడం కోసం బడ్జెట్ సమావేశాలకు విరామం ప్రకటించారు.

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరిగిన తొలి దశ బడ్జెట్ సమావేశాల్లో లోక్ సభ, రాజ్యసభలు 10 మార్లు మాత్రమే సమావేశమయ్యాయి. మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగిన రెండో దశ సమావేశాల్లో ఉభయ సభలు 15 మార్లు సమావేశమయ్యాయి.  మొత్తంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలు 25 సార్లు మాత్రమే సమావేశమయ్యాయి. తొలి దశలో ప్రధానంగా ఈ ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైననే చర్చ జరిగింది.

లోక్ సభలో బడ్జెట్ పై 14 గంటల 45 నిమిషాల పాటు చర్చ జరగగా, రాజ్యసభలో 2 గంటల 21 నిమిషాల పాటు మాత్రమే బడ్జెట్ పై చర్చ జరిగింది.  లోక్ సభలో 145 మంది సభ్యులు, రాజ్యసభలో 12 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చ సందర్భంగా కూడా ఉభయ సభల్లో పలుమార్లు గందరగోళం చోటుచేసుకుని తరచూ వాయిదాలకు కారణమయ్యాయి.