యథాతథంగా రిజర్వు బ్యాంకు రెపో రేటు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ గురువారం రోజు కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. అధిక ద్రవ్యోల్బణం సహా ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతుందని మెజారిటీ నిపుణులు అంచనా వేశారు.
 
అయితే రెపో రేటును ప్రస్తుతానికి యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించారు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ప్రస్తుతం రెపో రేటు 6.50 శాతం ఉన్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ భేటీ ఏప్రిల్ 3న ప్రారంభం కాగా, గురువారం తన నిర్ణయాలను ప్రకటించింది.  రెపో రేటును యథాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసీ కమిటీ సభ్యుల్లో మొత్తం ఆరుగురిలో ఐదుగురు సమర్థించారు.
 
ఇక ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇదే తొలి మానిటరీ పాలసీ సమీక్ష కావడం గమనార్హం. గత కొంతకాలంగా ప్రపంచ దేశాల్లో ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. దీనికి అధిక ద్రవ్యోల్బణమే కారణం. దీంతో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి.
 
ఇటీవల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది.  అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ మాత్రం దానికి బ్రేకులు వేసింది. దీంతో బ్యాంకుల రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ప్రస్తుతం లేవని వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
 
సాధారణంగా ఆర్‌బీఐ రెపో రేటు పెంచితే వెంటనే బ్యాంకులు ఈ భారాన్ని ప్రజలపై మోపుతుంటాయి. అన్ని రకాల ఉనాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తలకిందులైంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటును గతంలో 6.4 శాతంగా అంచనా వేయగా ఇప్పుడు దానిని 6.5 శాతానికి పెంచింది.

గతేడాది మార్చి సమయంలో రెపో రేటు భారత్‌లో 4 శాతం వద్ద ఉండేది. ఇక అప్పటినుంచి వరుసగా ఆర్బిఐ పెంచుకుంటూ పోయింది. వరుసగా 40, 50, 30 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచుకుంటూ పోయింది. దీంతో ఏడాది వ్యవధిలో 250 బేసిస్ పాయింట్లు లేదా 2.50 శాతం పెరిగి ఇప్పుడు 6.50 శాతంగా ఉంది.

 
ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ లక్షిత పరిధి అయిన 6 శాతానికి మించి నమోదవుతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచక తప్పట్లేదు. 2023 ఫిబ్రవరిలో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతంగా నమోదైంది. అంతకుముందు నెల 6.52 శాతంగా ఉంది. ప్రస్తుతానికి భారత బ్యాంకింగ్ వ్యవస్థ బాగానే ఉన్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు శక్తికాంత దాస్.