హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్రం హెచ్చరికలు

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6 గురువారం  రోజున జరగనున్న హనుమాన్ జయంతిని దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలను కాపాడాలని  అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ  చేసింది. శ్రీరామనవమి సందర్భంగా బీహార్, పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

రాష్ట్రాల్లో శాంతి భద్రతల నిర్వహణ, ఉత్సవాన్ని శాంతియుతంగా జరుపుకునేందుకు, మత సామరస్యానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ  ట్విటర్‌లో వెల్లడించింది.

‘‘హనుమాన్‌ జయంతి  ఏర్పాట్ల నిమిత్తం అన్ని రాష్ట్రాలకు హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పండగ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఆ సమయంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే ముప్పును నిరంతరం పర్యవేక్షించాలి’’ అని హోంశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. 

 శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.  ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని  హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పారామిలటరీ బలగాలను కోరాలని కలకత్తా హైకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హౌరా, హుగ్లీ జిల్లాల్లో శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా హింసాత్మక సంఘటనలు, ఆ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ విధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 144 సెక్షన్ విధించిన ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలను కూడా కోర్టు నిషేధించింది.
.
హ‌నుమాన్ జయంతి సంద‌ర్భంగా రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్  ప‌రిధిలో మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయాల‌ని సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.   ఏప్రిల్ 6 వ తేదీన ఉద‌యం 6 గంట‌ల నుంచి   ఏప్రిల్ 7వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు మూసి ఉంటాయ‌ని సీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  ఎవరైనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే  వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హెచ్చరించారు.