ముగ్గురు బ్రిటన్‌ జాతీయులను బంధించిన తాలిబన్లు

అఫ్గానిస్థాన్‌లో బ్రిటన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను తాలిబన్లు బంధించారు. వారిలో ఇద్దరు గత జనవరి నుంచి బంధీలుగా ఉండగా, మరొకరు ఎంతకాలం నుంచి ఉన్నారనే విషయం తెలియరాలేదని యూకేకు చెందిన నాన్‌ ప్రాఫిట్‌ గ్రూప్‌ ప్రెసీడియమ్‌ నెట్‌వర్క్‌ వెల్లడించింది.
 
బందీలుగా ఉన్నవారిలో చారిటీ వైద్యుడైన 53 ఏండ్ల కెవిన్‌ కార్న్‌వెల్‌, యూట్యూబ్‌ స్టార్‌ మైల్స్‌ రౌట్‌లెడ్జ్‌, మరొకరి పేరు తెలియనప్పటికీ.. అతడు హోటల్‌ మేనేజర్‌ అని స్థానిక మీడియా నివేదికలు తెలుపుతున్నాయి.  బంధీలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ట్విట్టర్‌ వేదికగా ప్రెసీడియమ్‌ నెట్‌వర్క్‌ కోరింది.
 
అపార్ధం చేసుకోవడం వల్లే వారిని బంధీలుగా పట్టుకున్నారని, విడుదల చేయాలని తాలిబన్లను కోరారు. ముగ్గురి కుటుంబ సభ్యులతో తాము మాట్లాడుతున్నామని చెప్పారు. బంధీలుగా ఉన్న బ్రిటీష్‌ వ్యక్తులతో చర్చించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, వారి కుటుంబాలకు మద్దతు ప్రకటించామని యుకె విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
 
గతేడాది నలుగురు బ్రిటన్‌ జాతీయులతోపాటు వెటరన్‌ టీవీ కెమెరామెన్‌ను తాలిబన్లు ఆరు నెలలకుపైగా నిర్బంధించిన సంగతి తెలిసిందే.  ఐఇఎ (ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్తాన్‌), బ్రిటన్‌ల మధ్య జరిగిన వరుస సమావేశాల అనంరతం ఆ ఐదుగురుని విడుదల చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు. బ్రిటన్లు తమ దేశ చట్టాలు, ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజల సాంప్రదాయాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.