సీఎం షిండే సారథ్యంలో ‘సావర్కర్ గౌరవ్ యాత్ర’

హిందుత్వవాది, స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత వినియాక్ దామోదర్ సావర్కర్ గౌరవార్ధం థానేలో ‘సావర్కర్ గౌరవ్ యాత్ర’ (ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అదివారంనాడు ప్రారంభించారు. ఈ యాత్రకు ఆయన సారథ్యం వహించగా, వందలాది మంది ప్రజలు యాత్రలో పాల్గొన్నారు.

దేశానికి సావర్కర్ అందించిన సేవలను స్మరించుకునేందుకు రాష్ట్రంలో ‘సావర్కర్ గౌరవ్ యాత్ర’ను చేపడుతున్నట్టు షిండే సారథ్యంలోని శివసేన గత మార్చిలో ప్రకటించింది. సావర్కర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శివసేన సర్కార్ ఈ యాత్రను ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

థానే సిటీలోని రామ్ గణేష్ గడ్కరి రంగాయతన్ ఆడిటోరియంలో వీడీ సావర్కర్‌కు ఆదివారంనాడు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం “సావర్కర్ గౌరవ్ యాత్ర” మొదలైంది. ‘నేను సావర్కర్‌ని’ అనే సందేశంతో పాటు ఇతర దేశభక్తి సందేశాలు ముద్రించిన కాషాయం టోపీలు ధరించి ఈ యాత్రలో పలువురు పాల్గొన్నారు.

సావర్కర్ వివరాలతో కూడిన శకటం ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రథం తరహాలో రూపొందించిన వాహనంలో షిండే, శివసేన-బీజేపీ కూటమి నేతలు పాల్గొన్నారు. 200కు పైగా మోటారు వాహనాలు, సుమారు 100 ఆటో రిక్షాల్లో జనం యాత్రను అనుసరించాయి.

బీజేపీ నేత డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే, థానే ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్, థానే బీజేపీ చీఫ్, ఎమ్మెల్సీ నిరంజన్ దావ్‌ఖరే, మాజీ మేయర్ నరేష్ మస్కే, శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్, తదితర నేతలు యాత్రలో పాల్గొన్నారు. సిటీలో సావర్కర్ భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ యాత్ర ముందుగు సాగింది. యాత్ర మార్గంలో పలుచోట్ల రంగవల్లులు తీర్చిదిద్దారు.

కాగా, సావర్కర్ జయంతి సందర్భంగా మే 21 నుంచి 28 వరకూ ‘వీర్‌భూమి పరిక్రమ’ చేపట్టనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సావర్కర్ జన్మస్థలమైన నాసిక్‌లోని భాగూర్‌లో థీమ్ పార్క్, మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మంత్రి మంగల్ ప్రభాత్ లోథా తెలిపారు.