గూగుల్ రూ.1,137 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే

దిగ్గజ సెర్చింజన్‌ గూగుల్‌కు నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌ఎటి) భారీ షాక్‌ ఇచ్చింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను గూగుల్‌కు గతంలో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ) రూ.1,337 కోట్ల భారీ జరిమానా విధించింది.

భారత్‌లో అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించింది. దీన్ని ఎన్‌సిఎల్‌ఎటిలో గూగుల్‌ సవాల్‌ చేసింది. ఈ అంశంలో బుధవారం ఎన్‌సిఎల్‌ఎటి చైర్‌పర్సన్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, సభ్యుడు అలోక్‌ శ్రీవాస్తవతో కూడిన బెంచ్‌ తీర్పును వెలువరించింది. 30 రోజుల్లోపు సిసిఐ విధించిన జరిమానా రూ.1337.76 కోట్లను డిపాజిట్‌ చేయాల్సిందేనని బెంచ్‌ స్పష్టం చేసింది.

సిసిఐ ఇచ్చిన ఉత్తర్వులు ఎలాంటి పక్షపాతంతో కూడుకుని లేవని ట్రిబ్యునల్‌ పేర్కొంది.  అలాగే 11 అప్లికేషన్లతో కూడిన గూగుల్‌ సూట్‌ను ముందే ఇన్‌స్టాల్‌ చేయాలని ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీదారులను (ఒఇఎం) గూగుల్‌ కోరడం అన్యాయమేనని స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్‌ ఫోర్క్‌లను అభివద్ధి చేయడం, పంపిణీ చేయడం నుంచి ఒఇఎం నిషేధించే యాంటీ ప్రాగ్మెంటేషన్‌ అగ్రిమెంట్‌ షరతులను తప్పుపట్టింది.

కాగా.. సిసిఐ జారీ చేసిన నాలుగు కీలక ఆదేశాలను పక్కన పెట్టడం గూగుల్‌కు కొంత ఊరట. సిసిఐ ఆర్డర్‌లోని 617.3, 617.9, 617.10 617.7 పేరాల్లో జారీ చేసిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. జరిమానాను 30 రోజుల్లో చెల్లించాలని గడువు పెట్టింది. ట్రిబ్యునల్‌ తీర్పునపై గూగుల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.