న్యూయార్క్ పర్యటిస్తున్న తైవాన్ అధ్యక్షురాలుకు చైనా బెదిరింపు

తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ బుధవారం న్యూయార్క్ చేరుకున్నారు. అయితే ఆమె పర్యటన పట్ల చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. యఎస్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్ కార్తీతో సమావేశం అయితే దృఢంగా పోరాడతామని చైనా ప్రకటించింది. చైనా నుండి తీవ్ర హెచ్చరికలు ఎదురైనప్పటికీ ఆమె పర్యటన సాగుతోంది.

తైవాన్ అధ్యక్షురాలు న్యూయార్క్ చేరుకోవడానికి ముందు అమెరికా జాతీయ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ సాయ్ అమెరికా పర్యటనను చైనా సాకుగా తీసుకుని తైవాన్ జలసంధి చుట్టూ కార్యకలాపాలను వేగవంతం చేయవద్దని సూచించారు. సాయ్ ఇంగ్ వెన్ అమెరికాతో పాటు గ్వాటెమాల, బెలిజ్ దేశాలనూ సందర్శించనున్నారు. తైవాన్ ను దౌత్య పరమైన దేశంగా అవి గుర్తించాయి.

శనివారం వరకు తైవాన్ అధ్యక్షురాలు న్యూయార్క్ లోనే ఉండనున్నారు.  లాస్ ఏంజెలెస్ ను కూడా ఆమె సందర్శించనున్నారు. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కానీ, క్యాలిఫోర్నియాలో స్పీకర్ మెక్ కార్తీని కలుసుకుంటారని తెలుస్తోంది. తైవాన్ తన సొంత ప్రాదేశిక ప్రాంతమని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది.

స్పీకర్‌ కెవిన్‌తో భేటీ అయ్యే విషయాన్ని త్సాయి ధృవీకరించనప్పటికీ, కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా ఈ భేటీ వుంటుందని తైవాన్‌ అధికారులు తెలిపారు. చైనా నుండి ఎదురయ్యే తీవ్ర ప్రతిస్పందనను నివారించేందుకు గానూ ఈ సమావేశం గురించి ప్రచారం చేయడానికి ఉభయ పక్షాలు విముఖంగానే వున్నాయి.

తైవాన్ సొంతంగా పాలించుకుంటున్నప్పటికీ, అది తమ దేశంలో భాగమంటోంది. మరోవైపు అమెరికా పర్యటనకు వెళ్లడానికి ముందు సాయ్ ఇంగ్ వెన్ మాట్లాడుతూ బయటి నుంచే వచ్చే ఒత్తిళ్లు ఇతర ప్రపంచంతో తైవాన్ సంప్రదింపులకు అడ్డు కాబోదని స్పష్టం చేశారు. ‘‘మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. మేమేమీ ప్రేరేపించడం లేదు. తైవాన్ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం విషయంలో బలంగా నిలబడుతుంది. మార్గం కష్టంగానే ఉన్నా, తైవాన్ ఒంటరి కాబోదు’’ అని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా చైనా తైవాన్‌ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి ఝా ఫెంగ్లియన్‌  దీనిపై స్పందిస్తూ, కేవలం హౌటల్‌లో బస చేయడమే కాదు, అమెరికన్‌ అధికారులతో సమావేశం కూడా అవుతున్నారని తెలిపారు. ఒకవేళ అనుకున్నట్లుగానే ఈ సమావేశం జరిగితే, కచ్చితంగా అది మరో కవ్వింపు చర్య కాగలదని స్పష్టం చేశారు.  గత ఏడాది ఆగస్ట్ లో యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ ను సందర్శించిన సందర్భంగా చైనా, అమెరికా మధ్య విభేదాలు తలెత్తడం తెలిసిందే. నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ముగిసిన తర్వాత చైనా బలగాలు తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేయడం గమనార్హం.