నమీబియా చీతా సాశ అనారోగ్యంతో మృతి

నమీబియా నుంచి గతేడాది తీసుకొచ్చిన ఎనిమిది చీతాల్లో ఒకటి అనారోగ్యంతో కన్నుమూసింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో సంరక్షిస్తోన్న విషయం తెలిసిందే.
 
గత సెప్టెంబరులో ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన వాటిలో ‘సాశ’ అనే ఆడ చీతా మూత్రపిండాల సంబంధ వ్యాధితో మరణించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. రోజువారీ సాధారణ పరీక్షల్లో భాగంగా సాశకు జనవరిలో కిడ్నీ ఇన్‌ఫెక్షన్ వచ్చినట్టు గుర్తించామని అధికారులు చెప్పారు. రక్త నమూనా పరీక్షల్లో క్రెటినిన్ స్థాయిలు అసాధారంగా చేరినట్టు వెల్లడయ్యిందని తెలిపారు.
 
‘‘మార్చి 22న సాశా అస్వస్థతతో కనిపించింది.. దీంతో దాన్ని క్వారంటైన్‌లోకి తరలించి రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ నిర్వహించాం.. ఆ చీతాకు మూత్రపిండాల సమస్య ఉన్నట్లు తేలింది.. రక్త నమూనా పరీక్షల్లో క్రెటినిన్ స్థాయిలు అసాధారంగా ఉన్నాయి” అని వివరించారు.
 
గతంలో దాని ఆరోగ్య స్థితిగతుల గురించి తెలుసుకొనేందుకు నమీబియా అధికారులను సంప్రదించగా, భారత్‌కు రాకముందే ఆ చీతాకు కిడ్నీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు తేలిందని చెప్పారు. సాశాను కాపాడటానికి స్థానిక వైద్యులతోపాటు నమీబియా నిపుణులు తీవ్రంగా శ్రమించారని, అయినా ఫలితం దక్కలేదని అధికారులు విచారం వ్యక్తం చేశారు.
 
నమీబియా నుంచి తీసుకొచ్చిన మిగిలిన ఏడు చీతాలు ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో ఐదు ఆడ, మూడు మగ చీతాలు. గతవారం ఎల్టన్, ఫ్రెడ్డీ అనే రెండు చిరుతలను అడవుల్లోకి విడుదల చేశారు. దక్షిణాఫ్రికా నుంచి ఫిబ్రవరి 17న 12 చీతాలను వాయుసే విమానంలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
 
భారత అడవుల్లో చీతాల సంతతిని తిరిగి ప్రవేశపెట్టాలని భావించిన కేంద్ర ప్రభుత్వం దక్షిణాఫ్రికాతో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గతేడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు.