వివేకా హత్యకేసులో విచారణాధికారిని మార్చమన్న సుప్రీంకోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ప్రశ్నించింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది.
 
 స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసిన రాజకీయ వైరం అని మాత్రమే రాశారని మండిపడింది. విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని అసహనం వ్యక్తం చేసింది. కేసు ఆలస్యం పై జస్టిస్ ఎం ఆర్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారని సీబీఐని ప్రశ్నించారు.
 
స్టేటస్ రిపోర్టులో చెప్పిందే చెప్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. కేసుకు ఒక ముగింపు ఉండాలని పేర్కొంటూ  ఇందులో విస్తృత కుట్ర ఉందని హైకోర్టు అభిప్రాయపడిందని గుర్తు చేశారు. ఈ కేసులో బెయిలిచ్చే ప్రసక్తి కూడా లేదని కూడా స్పష్టం చేశారు. కేసు మెరిట్స్ గురించి మాట్లాడదలచుకోలేదని చెబుతూ 2021 నుంచి కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారం వ్యక్తం చేశారు.
 
రాజకీయ వైరంతోనే హత్య జరిగిందని చెప్తున్నారని పేర్కొంటూ దోషిని పట్టుకునేందుకు ఇది ఒకటే సరిపోదని స్పష్టం చేశారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి కేసు దర్యాప్తు ముగించే స్థితిలో లేనట్టుందని, దర్యాప్తు ఇలా కొనసాగడం మంచిది కాదని స్పష్టం చేశారు.  ఈ హత్యలో ఉన్న విస్తృత కుట్రను బయటకు తీయాలని, దర్యాప్తు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.  ఈ అంశాలన్నీ సిబిఐ డైరెక్టర్ కు చెప్పాలని.. తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా వేసింది ధర్మాసనం