జైలులో బిజెవైఎం నేతలను పరామర్శించిన కిషన్ రెడ్డి

తెలంగాణలో సంచలనం రేపిన  టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనకాల పెద్దల హస్తం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.  బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్‌తో సహా అరెస్ట్ అయిన 11 మంది బీజేవైయం నేతలను చంచల్ గూడ జైల్లో ఆదివారం ఆయన పరామర్శించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో బీజేవైఎం నేతలు అరెస్ట్ అయ్యారు.” ప్రశ్నాపత్రం లీక్ అవడం దుర్మార్గం. ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వడంతో నిరుద్యోగులు ఆవేదనకు గురి అవుతున్నారు. తెలంగాణ  యువత ఆక్రోశంతో ఉంది.  ప్రశ్నపత్రం లీకేజీలో పెద్దల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది” అని తెలిపారు.

 కాబట్టి దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని స్పష్టం చేశారు. తమ అసమర్థతను రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని పేర్కొంటూ రాష్ట్రంలో కుటుంబ, అవినీతి, మాఫియా పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

ప్రశ్నాపత్రం లీకేజీలో యువ మొర్చా నేతలపై అక్రమ కేసులు పెట్టారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. పెట్రోల్ పోసి తగల బెట్టడానికి వచ్చారంటూ వారిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగలబెట్టడం మా సంస్కృతి కాదని స్పష్టం చేశారు.  తమకు జైళ్లు, కేసులు కొత్త కాదని, తెలంగాణలో మార్పు తీసుకువచ్చే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు. మార్పు బిజెపితోనే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారన్న ఆయన.. ప్రజలకోసం దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.