రాహుల్ గాంధీపై అనర్హత వేటు

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్ గాంధీపై లోక్​సభలో అనర్హత వేటు పడింది. ఫలితంగ రాహుల్​ గాంధీ తన వయనాడ్​ సీటును కోల్పోయారు. లోక్​సభ సెక్రటేరియట్​ ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్​కు అతిపెద్ద షాక్​ తగిలినట్టు అయ్యింది.

“వయనాడ్​ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీ రాహుల్​ గాంధీపై అనర్హత వేటు వేస్తున్నాము. పరువు నష్టం కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష పడటమే ఇందుకు కారణం. ఆయన దోషిగా తేలిన రోజు.. అంటే 2023 మార్చ్​ 23 నుంచి రాహుల్​ గాంధీపై అనర్హత వేటు అమల్లోకి వస్తుంది. 1951 రిప్రజెంటేషన్​ ఆఫ్​ పీపుల్​ యాక్ట్​ ఆర్టికల్​ 102 (1)(ఈ) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాము,” అని లోక్​సభ సెక్రటేరియట్​ ప్రకటనలో పేర్కొంది.

 

ఈ విధంగా అనర్హత వేటుకు గురయ్యే వారు మరో 8 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయలేరని చట్టాలు చెబుతున్నాయి. 2019 లోక్​సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్​ గాంధీ. కోలార్​లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

“దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?” అని ప్రశ్నించారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్​ మోదీ, లలిత్​ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో 2019లో గుజరాత్​లోని సూరత్​ జిల్లా కోర్టులో రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్​ దాఖలైంది.

ఈ వ్యవహారంపై విచారణ పూర్తి చేసిన అనంతరం గురువారం కీలక తీర్పును వెలువరించింది సూరత్​లోని జిల్లా కోర్టు. రాహుల్​ గాంధీని దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 30 రోజుల బెయిల్​తో పాటు తీర్పును సవాలు చేసేందుకు అవకాశాన్ని ఇచ్చింది. 52 ఏళ్ల రాహుల్ గాంధీని ఐపిసి సెక్షన్‌లు 499, 500 కింద చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హెచ్.హెచ్. వర్మ దోషిగా తేల్చేశారు.