అక్టోబర్ 5 నుంచి భారత్ లో 2023 వన్డే ప్రపంచ కప్

భారతదేశం ఆతిధ్యం ఇవ్వనున్న 2023 వన్డే ప్రపంచకప్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో చివరి ఆట జరుగుతున్నట్లు తెలుస్తున్నది. చివరిసారిగా భారతదేశం 2011లో వన్డే ప్రపంచకప్‌ను నిర్వహించింది.

స్వదేశంలో జరిగిన మెగాటోర్నీలో టీమిండియా టైటిల్‌ విజేతగా నిలిచింది. రెండుసార్లు ప్రపంచకప్‌ విజేత అయిన టీమిండియాకు రోహిత్‌శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మొత్తంగా 46 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 10 జట్ల మధ్య 48 ఆటలు జరుగుతాయి. అందుకోసం దేశవ్యాప్తంగా 12 వేదికలను బీసీసీఐ సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.

అహ్మదాబాద్‌తోపాటు, బెంగళూరు, ఢిల్లి, చెన్నై, ధర్మశాల, హైదరాబాద్‌, కోల్‌కతా, లక్నో, ఇండోర్‌, రాజ్‌కోట్‌, ముంబై ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్నాయి.  రోహిత్‌ నాయకత్వంలో గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే.  ఈ ఏడాది జూన్‌లో జరిగే ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమిండియా రోహిత్‌ నాయకత్వంలోనే ఫైనల్‌కి చేరింది.

ఇక 2019 వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్‌ విన్‌ సాధించింది. 2023 మెగా ఈవెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా అడుగుపెడుతోంది.  ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్తాన్‌ జట్టు వీసాలను భారత ప్రభుత్వం క్లియరెన్స్‌ చేయడంపై బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. కాగా,  ఈ ప్రపంచకప్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌- పాక్‌ మధ్య జరుగుతుందని పాక్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ జోస్యం  చెప్పాడు.

 
భారత్‌ వేదికగా 2011 ప్రపంచకప్‌ జరిగినప్పుడు ఫైనల్‌లో శ్రీలంక జట్టును మట్టికరిపించి టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ను సాధించింది. అంతకు ముందు సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో పాక్‌ ఘోర పరాజయం పాలైంది. ఓ స్పోర్ట్స్‌ ఛానెల్‌తో అక్తర్‌ మాట్లాడుతూ.. ‘2023 వన్డే ప్రపంచకప్‌లో నాకు భారత్‌-పాక్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కావాలి. ఈ సారి 2011లో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి’ అని చెప్పారు.