హిందూకుష్‌ పర్వతాల్లో భారీ భూకంపం

అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్‌ ప్రాంతంలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్‌ సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. అయితే భూకంపం ధాటికి పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది.
భూకంపం వల్ల ఖైబర్‌ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారని పాక్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ అధికార ప్రతినిధి బిలాల్‌ ఫైజీ తెలిపారు. ప్రకృతి విపత్తులో గాయపడినవారు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
 
మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో హిందూకుష్‌ పర్వతాల్లో భూకంపం వచ్చింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్‌ సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.
అఫ్గానిస్థాన్‌లో  గంటల వ్యవధిలో రెండోసారి భూప్రకంపనలు చోటు చేసుకోవడం గమనార్హం. ‘అల్లాహ్.. అందరినీ కాపాడు’ అనే పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.
పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండిలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఉత్తరభారతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లో భూమి కంపించింది. ఢిల్లీలో సుమారు 2 నిమిషాల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
 
ఇండ్లు, భవనాలు కదిలాయని, భయంతో రోడ్లపైకి పరుగులు పెట్టామని ప్రజలు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇండ్లలో ఫ్యాన్లు, వస్తువులు ఊగుతున్న వీడియోలను మరికొంతమంది షేర్‌ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తరచుగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇది యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల జంక్షన్ ఉంది.