బిజెపి ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పార్టీ

* వాల్ స్ట్రీట్ జర్నల్ కధనం

అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్.. సాధారణంగా మోడీ సర్కారును లక్ష్యంగా చేసుకుని వ్యతిరేక కథనాలు రాస్తుంటుంది. ఇప్పుడు అదే పత్రిక.. బిజెపిని అత్యంత ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీగా పేర్కొంది. వాల్టర్ రస్సెల్ అనే ఆథర్ దీనిపై వ్యాసం రాశారు. ‘‘భారత్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. అమెరికా జాతీయ ప్రయోజనాల కోణం నుంచి చూస్తే ప్రపంచంలోనే ఎంతో ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ. అంతేకాదు చాలా తక్కువగా అర్థం చేసుకున్న పార్టీ’’అని పేర్కొన్నారు.

భారత్ ఆర్థికంగా శక్తిమంతమైన దేశంగానే కాకుండా, అమెరికా వ్యూహ ప్రణాళికల్లో కీలక దేశంగా ఉంటోందని తెలిపారు.భారత దేశం ఓవైపు జపాన్‌తోపాటు ఆర్థిక శక్తిగా ఎదగడంతోపాటు, మరోవైపు ఇండో-పసిఫిక్‌లో అమెరికా వ్యూహంలో చాలా ముఖ్యమైన దేశంగా నిలిచిందని పేర్కొంది.చైనా శక్తిని కట్టడి చేయాలన్న అమెరికా ప్రయత్నాలు భారత్ సాయం లేకుండా సఫలం కాబోవని స్పష్టం చేశారు.

‘‘అమెరికా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, భారత దేశ అధికార పార్టీ బీజేపీ ప్రపంచంలో చాలా ముఖ్యమైన విదేశీ రాజకీయ పార్టీ. దీనిపై చాలా తక్కువ అవగాహన ఉంది’’ అని ఈ వ్యాసం పేర్కొంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ, 2024లో మరోసారి విజయం సాధించే దిశగా దూసుకెళ్తోందని తెలిపింది.

భారతీయులు కాని వారికి తెలియని రాజకీయ, సాంస్కృతిక చరిత్ర నుంచి బీజేపీ ఎదిగినందున దీన్ని చాలా తక్కువగా అర్థం చేసుకున్నట్లు చెప్పారు. బిజెపి కేవలం హిందువులకే కాకుండా, ఇతర వర్గాలకూ దగ్గరవుతున్న అంశాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక తన కాలమ్ లో ప్రస్తావించింది.

ఈశాన్య భారత దేశంలో క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఇటీవల రాజకీయంగా విజయాలు సాధించిందని తెలిపింది. బీజేపీ ఇటీవలి కాలంలో సాధించిన విజయాల్లో చాలా ముఖ్యమైన విజయం ఇది అని వివరించింది.  20 కోట్ల జనాభా ఉన్న యూపీలో బిజెపికి షియా ముస్లింల మద్దతును గుర్తు చేసింది. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య పాత్ర పోషించినట్టు పేర్కొంది.

ఒకప్పుడు అస్పష్టంగా, నామమాత్రంగా ఉన్న ఓ సాంఘిక ఉద్యమం సాధించిన విజయం ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యతలో ప్రతిబింబిస్తుందని తెలిపింది. తరతరాలుగా సామాజికవేత్తలు, ఉద్యమకారులు చేసిన కృషి ఆధారంగా జాతీయ పునరుజ్జీవం జరగాలనేది ఈ సాంఘిక ఉద్యమమని తెలిపింది. ఆధునికతకు విలక్షణమైన హిందూ మార్గాన్ని రూపొందించడం కోసం సామాజిక ఆలోచనపరులు, ఉద్యమకారులు తరతరాలపాటు కృషి చేశారని పేర్కొంది.

అధికార పక్షాన్ని విమర్శించే పాత్రికేయులు వేధింపులకు గురవుతుండటం, మైనారిటీలపై మూకదాడులు జరుగుతుండటం, మత మార్పిడులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలు, ఆరెస్సెస్‌ గురించి భయాలు వంటి ఆందోళనకరమైన అంశాలను అమెరికన్ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నప్పటికీ, భారత దేశం చాలా సంక్లిష్టమైనదని, అక్కడ ఇతర అంశాలు కూడా ఉన్నాయని తెలిపింది.

‘‘సీనియర్ బీజేపీ, ఆరెస్సెస్ నేతలతో, అదేవిధంగా, వారి విమర్శకులతో, అనేకసార్లు సమావేశమైన తర్వాత, ఓ సంక్లిష్టమైన, శక్తివంతమైన ఉద్యమం గురించి అమెరికన్లు, పాశ్చాత్యులు మరింత ఎక్కువగా తెలుసుకోవలసిన అవసరం ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను’’ అని ఈ వ్యాస రచయిత వాల్టర్ రసెల్ మీడ్ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఆరెస్సెస్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పౌర సమాజ సంస్థగా ఎదిగిందని తెలిపారు.