
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ స్టార్టప్లకు నిధులు సమకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్విబి) గతవారం దివాలా తీసిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఆ బ్యాంకులో భారత్కు చెందిన స్టార్టప్ సంస్థలు కూడా డిపాజిట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్ని సంస్థల డిపాజిట్లు సిలికాన్ వ్యాలీ బ్యాంకులో ఉన్నాయనే అంశంపై కేంద్రం వివరాలను సేకరిస్తోంది.
సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారతీయ స్టార్టప్లకు చెందిన సుమారు 1 బిలియన్ డాలర్ల (రూ. 8,251.5 కోట్లు) విలువైన డిపాజిట్లు ఉంటాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అంచనా వేశారు. ఈ స్టార్టప్లను స్థానిక బ్యాంకులు ఆదుకోవాలని, వారికి మరింతగా రుణాలు ఇవ్వాలని సూచించారు.
అనిశ్చిత పరిస్థితులతో సంక్లిష్టమైన అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థపై మన దేశ స్టార్టప్లు ఆధారపడకుండా ఉండేలా భారతీయ నూతన బ్యాంకింగ్ వ్యవస్థను రూపొందించడం ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉందని ట్విట్టర్ స్పేస్ చాట్లో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాకేష్ ఝున్ఝున్వాలాకు చెందిన నజారా టెక్నాలజీస్ ఇటీవల తన రెండు సబ్సిడరీ కంపెనీలకు చెందిన నిధులు ఎస్విబిలో ఉన్నాయని వెల్లడించింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంకు 2022 చివరి నాటికి 209 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. సంక్షోభం తలెత్తిన వెంటనే డిపాజిటర్లు ఒక్క రోజులోనే 42 బిలియన్ డాలర్ల వరకు ఉపసంహరించుకున్నారు. దీంతో బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10 ఎస్విబిని మూసివేశాయి.
ఇలాఉండగా, అమెరికా పదకొండు అతిపెద్ద బ్యాంకులు గురువారం కాలిఫోర్నియాకు చెందిన ‘ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ ‘ కోసం 30 అమెరికన్ డాలర్ల రెస్క్యూ ప్యాకేజిని ప్రకటించాయి. బ్యాకింగ్ రంగంలో ఏర్పడుతున్న సంక్షోభాలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఏర్పాటు చేశారు.
గతవారం అమెరికాలోని రెండు అతిపెద్ద బ్యాంకులైన సిలికాన్ వ్యాలీ, సిగేచర్ బ్యాంకులు మూతపడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31 నాటికి మొత్తం 176.4 బిలియన్ డాలర్ల డిపాజిట్లను కలిగిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు నుండి శుక్రవారం డిపాజిట్ దారులు కొన్ని గంటల వ్యవధిలోనే 40 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నట్లు దివాలాకు దగ్గరైంది.
ఇతర పేరులేని బ్యాంకులు బీమా చేయని డిపాజిట్లను పెద్ద మొత్తంలో ఖాతాదారులు ఉపసంహరణలను చూసాయని బ్యాంకుల సంఘం ఓ ప్రకటనలో ధృవీకరించింది.
More Stories
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదంలో ఆర్ధిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభంపై భారత్ అప్రమత్తం
5జీ కోసం జియో లక్ష టవర్లు