75 నిమిషాల్లో బెంగళూరు – మైసూరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం కర్ణాటక పర్యటన సందర్భంగా  బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.8,480 కోట్ల వ్యయంతో 118 కి.మీ పొడవైన ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే బెంగళూరు – మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 3 గంటల నుండి 75 నిమిషాలకు తగ్గించ‌నుంది.

మాండ్యలో ప్రధానమంత్రి పర్యటన గురించి తెలియజేస్తూ “దేశమంతటా ప్రపంచ స్థాయి కనెక్టివిటీని నిర్ధారించాలనే ప్రధాన మంత్రి దృక్పథానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధి శరవేగంగా జ‌రుగుతుంది. ఈ ప్ర‌య‌త్నంలో ముందుకు సాగుతూ, ప్ర‌ధాన మంత్రి బెంగ‌ళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేని జాతికి అంకితం చేయ‌నున్నారు”. అని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కోంది.

ప్రధాని మోదీ ఆదివారం సుమారు రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అంకితం చేసి, శంకుస్థాపన చేస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్ హెచ్-275లోని బెంగళూరు-నిడఘట్ట-మైసూరు సెక్షన్‌లో 6-లేనింగ్ రోడ్ కూడా ఉంది.

ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఎంతో బాగా స‌హాయ ప‌డనుంది. అంతే కాకుండా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శ్రీరంగపట్నం, కూర్గ్, ఊటీ, కేరళ వంటి ప్రాంతాలకు సులభంగా చేరుకోడానికి స‌హాయ‌ప‌డుతుంది.తద్వారా పర్యాటక సామర్థ్యాం పెరిగే అవ‌కాశం ఉంది.

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను జాతికి అంకితం చేసిన త‌రువాత‌ మైసూరు-ఖుషాల్‌నగర్ 4 లేన్ హైవేకి ప్రధాని శంకుస్థాపన చేయ‌నున్నారు. 92 కి.మీ.లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ సుమారు రూ.4130 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయబడుతుంది.  బెంగుళూరుతో కుశాల్‌నగర్ కనెక్టివిటీని పెంచడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో పాటు ప్రయాణ సమయాన్ని 5 నుండి 2.5 గంటల వరకు సగానికి తగ్గించడంలో సహాయపడుతుంది.