అన్నా చెల్లెళ్లు చెప్పేవన్నీ అబద్దాలే

నోరు తెరిస్తే అబద్దాలు.. నిజం మాట్లాడమే తెలియదు వాళ్లకు.. వాళ్లకు వాళ్లు గొప్పోళ్లుగా ఊహించుకుంటున్నారంటూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కేటీఆర్, కవితలపై విరుచుకు పడ్డారు.  తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే పని చేసిన కవిత రాజకీయ వేధింపులు అని మాట్లాడటం సిగ్గు చేటని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్‌ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలను మించినవారు లేరని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. లిక్కర్‌ స్కామ్‌పై దృష్టి మళ్లించేందుకే ఢిల్లీలో ధర్నా నాటకాలు ఆడుతున్నారని, సానుభూతి కోసమే బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని స్పష్టం చేశారు.

 ప్రధాని మోదీ తమను టార్గెట్ చేస్తున్నారని అన్నా చెల్లెళ్లు అంటున్నారని పేర్కొంటూ మోదీ టార్గెట్ చేసేంత గొప్ప కుటుంబం, మనుషులు అయితే వారు కాదంటూ చురకలు అంటించారాయన. అక్రమ వ్యాపారంలో ఇరుక్కుపోయి, అక్రమాలు చేస్తూ మోదీని తప్పుపడతారా అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తమకు తాముగా కేసులో ఇరుక్కుని బీజేపీపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు.

ఫోన్లు పగలగొట్టింది ఎవరు? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎవరు తలదూర్చారు? ఎవరు మార్చారు? ఎవరు స్పెషల్ ఫ్లయిట్స్ లో వెళ్లారు?. ఎవరు డబ్బులు సంపాదించారు? అంటూ కిషన్ రెడ్డి నిలదీశారు. మహిళా రిజర్వేషన్ల కోసం మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి ఒక చట్టం, సామాన్యులకు ఒక చట్టం ఉంటుందా?  అని ప్రశ్నించిన కిషన్ రెడ్డి మద్యం కేసు బయట పడగానే మహిళా రిజర్వేషన్లు గుర్తొచ్చాయా? అని నిలదీశారు.

 తెలంగాణలో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలించిన మీకు రిజర్వేషన్ల గురించి అడిగే హక్కు ఉందా? అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మీరు ఢీల్లీకి వెళ్లి అక్రమ మద్యం వ్యాపారం చేయాలని తెలంగాణ సమాజం చెప్పిందా? అని ఆయన ఎద్దేవా చేసారు.