అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం ఏమైందని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను కోర్టు పరిధి నుంచి దాటి పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
అధికారం వచ్చి మూడున్నరేళ్లు దాటినా ఎందుకు పరిష్కరించలేదని ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలో వీర్రాజు ప్రశ్నించారు. ‘అగ్రిగోల్డ్ సంస్థ మదుపు చేసిన కష్టమర్లకు సకాలంలో నగదు చెల్లించకపోవడంతో 142 మంది మృతి చెందారు. ఆనాడు అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి రూ. 3 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తానంటే ఆనాడు మీరు రూ10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తానని చెప్పారు’ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పైసా అయినా ఎక్స్ గ్రేషియా చెల్లించారా? అని బిజెపి నేత నిలదీశారు. రూ.10 వేలులోపు పరిధి ఉన్న బాండ్లుకు 2019 సంవత్సరంలో రూ.250 కోట్లు, 2021 ఆగస్టులో రూ. 667 కోట్లు మేరకు మాత్రమే బాండ్లు పరిష్కారం జరిగింది. ఆ తర్వాత ఒక్కరికి కూడా పరిష్కారం కాలేదని వీర్రాజు లేఖలో ధ్వజమెత్తారు.
అగ్రిగోల్డ్ బాధితులు సుమారు 14 లక్షల మంది తమ బాండ్లకు ఎప్పుడు నగదు పరిష్కారం జరుగుతుందని ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. విచిత్రమేమంటే అగ్రిగోల్డ్ సంస్ధ నడుపుతున్న ఇతర సంస్ధలు యధావిధిగా నడుస్తున్నాయని, వాటి జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్లో నగదు మదుపు చేసి బాండ్లు తీసుకున్న వారి సమస్యలపై.. ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? అని సోము వీర్రాజు నిలదీశారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
More Stories
మోదీ పథకాలకు స్టిక్కర్ లతో జగన్ మోసం
రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి
విశాఖ స్టీల్ మూతపడే దుస్థితి శోచనీయం