పాక్ లో ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది పోలీసులు మృతి

పాకిస్థాన్‌లోని కల్లోలిత బెలూచిస్థాన్‌లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనలో తొమ్మండుగురు పోలీసులు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. బైక్‌పై వెళ్లుతున్న మానవబాంబు గురిచూసుకుని బెలూచిస్థాన్ కానిస్టేబులరీ దళానికి చెందిన పోలీసులను తీసుకువెళ్తున్న శకటంపైకి దూసుకు వెళ్ళింది.

పాకిస్తాన్‌లోని నైరుతి ప్రావిన్స్‌లో ఈ మానవబాంబు తన దుస్తులలో పేలుడు పదార్థాలను అమర్చుకుని ఉండటం, వ్యాన్‌ను వేగంగా ఢీకొనడంతో జరిగిన పేలుడు ఈ మార్గంలో విధ్వంసానికి దారితీసింది. సిబి నుంచి క్వెట్టాకు భద్రతా బలగాలు తిరిగి వస్తుండగా బోలాన్‌లోని కున్‌బ్రీ పర్వతాల మధ్య ఆత్మాహుతి దాడి జరిగింది.

ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో బలూచ్ తిరుగుబాటుదార్లు , ఇస్లామిక్ మిలిటెంట్లు తరచూ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటంతో పలువురు బలి అవుతున్నారు. ప్రావిన్షియల్‌ రాజధాని క్వెట్టాకు తూర్పున దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో కాంబ్రి బ్రిడ్జ్‌ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగినట్లు బలూచిస్తాన్‌లోని కచ్చి జిల్లా డిప్యూటీ కమిషనర్‌ అఘా సమీవుల్లా మీడియాకు వెల్లడించారు. ఈ ట్రక్కులో 22 మంది బలూచిస్తాన్‌ పోలీస్‌ కానిస్టేబుల్స్‌ ఉన్నారని, ఇది ప్రావిన్షియల్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన వింగ్‌ అని సమీవుల్లా చెప్పారు. 

ఆదివారం ముగిసిన సిబి ఉత్సవాల వద్ద తమ భద్రతా విధుల నిర్వహణ తరువాత జవాన్లు వ్యాన్‌లో వస్తున్నారని , ఈ దశలోనే ఆత్మాహుతి దాడి జరిగిందని సీనియర్ పోలీసు అధికారి మహమ్మూద్ నొటెజాయి తెలిపారు. ఉగ్రవాదులు తొలుత సిబి ఉత్సవాలలోనే దాడికి దిగాలని సంకల్పించారని, అయితే భారీ స్థాయి భద్రతా ఏర్పాట్లు వారి యత్నాలు ఫలించలేదని, దీనితో క్వెట్టాకు తరలివచ్చే భద్రతా బలగాలను లక్షంగా ఎంచుకుని దాడికి దిగారని వివరించారు. బైక్‌ను అత్యంత వేగంగా నడుపుతూ వ్యాన్‌లోకి దూసుకువెళ్లేలా చేసి ఈ వ్యక్తి తనను తాను పేల్చకున్నాడని వెల్లడైంది.

బాలోచ్‌ రెబల్‌ గ్రూప్‌ ప్రత్యేక పాకిస్తాన్‌ రాష్ట్రం కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడిని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీప్‌ తీవ్రంగా ఖండించారు. దేశంలో అస్థిరతను సృష్టించే చర్యల్లో భాగంగానే ఈ దాడి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక గత నెలలో బర్ఖాన్‌ నగరంలో జరిగిన బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందగా, 14 మంది గాయలపాలయ్యారు.