బీజేపీలో చేరిన జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి

జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్ ప‌ర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేధింపులు భరించలేక తాను జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన డాక్టర్ బోగ శ్రావణి అనంతరం బీఆర్ఎస్ సభ్యత్వానికి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.
 
బిఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం బిజెపి నేతలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ లు భోగ శ్రావణి ఇంటికి వచ్చి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు భోగ శ్రావణి ప్రవీణ్ బుధవారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.
 
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైన్యంలో ఒక సైనికురాలిగా పనిచేస్తానని బీజేపీలో చేరిన అనంతరం భోగ శ్రావణి తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే అణచివేతకు గురై, కన్నీరు పెట్టుకొని తాను మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని పేర్కొన్నారు.
 
తాను కన్నీటితో రాజీనామా చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుండి తనకు ఎలాంటి ఓదార్పు లభించలేదని పేర్కొంటూ ఒక ఆడబిడ్డగా తనను అక్కున చేర్చుకున్న బీజేపీ నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు భరోసా కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
 
మోదీ నాయకత్వంలో భరతమాత సేవ చేసేందుకు ఒక సైనికురాలిగా పని పనిచేస్తానని తెలిపారు. జగిత్యాల జిల్లాలో బీజేపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని శ్రావణి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ, ఎంపీ డి అరవింద్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జగిత్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు మోర పెళ్లి సత్యనారాయణ రావు, జగిత్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రంగు గోపాల్, తదితరులున్నారు.

బిఆర్ఎస్ లో కిందిస్థాయి నేతలకు ఏమాత్రం గౌరవం లేదని పేర్కొంటూ  కేసులకు భయపడి చాలా మంది నేతలు బయటకు రావడం లేదని, బీజేపీతో మంతనాలు సాగిస్తున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని డీకే అరుణ  చెప్పారు. అయితే ఎన్నికలు సమీపించే కొద్దీ ఒక్కొక్కరుగా వచ్చి చేరతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీలో కిందిస్థాయి నేతలు ప్రతిరోజూ వేధింపులకు, అణచివేతకు గురవుతున్నారని ఆమె తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

శ్రావణిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్రంగా వేధించారని, మరో రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆత్మాభిమానం చంపుకోలేక తన పదవికి రాజీనామా చేసి వచ్చారని అరవింద్ తెలిపారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న జగిత్యాలలో ఈ విషయం తెలుసుకుని వెంటనే శ్రావణిని సంప్రదించానని, బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించానని చెప్పారు.