టెన్త్ పేపర్ లీకేజీ కేసులో `సుప్రీం’లో నారాయణకు చుక్కెదురు

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో సోమవారం కీలక విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. దీనిపై సెషన్స్‌ కోర్టులోనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. మెరిట్‌ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సూచించింది.
 
అలాగే, సెషన్స్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంటూ పిటిషన్‌పై విచారణను ధర్మాసనం ముగించింది.
 
కాగా, గతేడాది ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్‌ నుంచి పదో తరగతి ప్రశ్నపత్రం లీకైన విషయం తెలిసిందే. వాట్సాప్‌ ద్వారా తెలుగు ప్రశ్నపత్రం బయటకు రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ పాత్ర ఉన్నట్లు అప్పట్లో చిత్తూరు పోలీసులు తెలిపారు.
 
 అయితే, నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే నారాయణ వైదొలిగారంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై గత కొన్ని నెలలుగా జిల్లా కోర్టు, హైకోర్టుల్లోనూ విచారణ జరిగింది. ఇటీవల నారాయణ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగిన సుప్రీం కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.