ధర్మవరం – గుత్తి డబ్లింగ్, విద్యుదీకరణ పనులు పూర్తి

రైల్వే శాఖ చివరి దశలో వున్నా ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఆంధ్రప్రదేశ్ లో డబ్లింగ్ తో పాటు విద్యుదీకరణను పూర్తి చేసుకున్న మరో కీలకమైన ప్రాజెక్ట్ ఇది. చిగిచెర్ల నుండి ధర్మవరం మధ్య విభాగాన్ని డబ్లింగ్, విద్యుదీకరణతో సహా పూర్తి చేసి, దక్షిణ మధ్య రైల్వే విజయవంతంగా ప్రారంభించింది.
 
దానితో గుత్తి నుంచి ధర్మవరం వరకు మొత్తం 90 కిలోమీటర్ల మేర ఇప్పుడు డబుల్ రైల్వే లైన్ కనెక్టివిటీతో విద్యుద్దీకరించబడింది. గుత్తి – ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక ప్రాముఖ్యమైన రైలు లింక్, ఇది దక్షిణ భారత రాష్ట్రాలకు ఒక ప్రవేశ ద్వారంగా కుడా పనిచేస్తుంది.  ఈ లైన్ రెండు తెలుగు రాష్ట్రాలను కర్ణాటక రాజధాని నగరం బెంగుళూరు, వెలుపల కలిపే ముఖ్యమైన మార్గాలలో ఒకటిగా పనిచేస్తుంది.
 
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ zసర్వీస్ (రైట్స్) ద్వారా 90 కిలోమీటర్ల మేర గుత్తి -ధర్మవరం ప్రాజెక్టు డబ్లింగ్.  విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం మంజూరైన వ్యయం రూ. 636.38 కోట్లు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రైల్వే శాఖ ద్వారా మాత్రమే నిధులు సమకూర్చడం జరిగింది. గుత్తి -ధర్మవరం మధ్య 90 కిలోమీటర్ల మేర పనులు దశలవారీగా చేపట్టారు.
 
మొదటగా కల్లూరు – గార్లదిన్నె మధ్య 13 కిలోమీటర్ల దూరం డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు సెప్టెంబర్, 2019 లో పూర్తయ్యాయి. దీని తర్వాత చిగిచెర్ల మరియు జంగాలపల్లె మధ్య 11 కిలోమీటర్లు జూన్ 2020లో, గార్లదిన్నె-తాటిచెర్ల మధ్య 9 కిలోమీటర్లు నవంబర్, 2020లో ప్రారంభించారు.  2021 అక్టోబర్‌లో కల్లూరు – గుత్తి మధ్య 27కి.మీ.లు, ఆగస్ట్, 2022లో తాటిచెర్ల – జంగాలపల్లె మధ్య 19 కి.మీ.లు. ప్రారంభించారు .
 
ఇప్పుడు, చివరి విబాగంలో 11 కి.మీ.ల దూరం వరకు మొత్తం పనులు పూర్తి చేయడంతో రైలు కార్యకలాపాలు సాగించేందుకు గాను ఈ మొత్తం ప్రాజెక్ట్ ను  ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ఈ ముఖ్యమైన విభాగంలో రద్దీని తగ్గిస్తుంది. బెంగళూరు, ఆ తర్వాతి స్టేషన్లకు ఎక్కువ సంఖ్యలో ప్యాసింజర్, సరకు రవాణా చేసే రైళ్లను నడపడానికి వీలు కల్పిస్తుంది.
 
ఇది సెక్షన్‌లోని రైళ్ల సగటు వేగాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది, అలాగే మెరుగైన రైలు కనెక్టివిటీతో ఈ ప్రాంతపు సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.  ధర్మవరం-బెంగళూరు మధ్య నైరుతి రైల్వే పరిధిలోని డబుల్‌లైన్‌ పనులు కూడా వీటితోపాటు ప్రారంభించడబడి, అందులో కొన్ని విభాగాలు పూర్తవడం జరిగింది.
 
ఈ కీలక ప్రాజెక్టును ప్రారంభించడంలో చురుకుగా పాల్గొన్న దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ సంస్థ, రైట్స్ బృందం, గుంతకల్ డివిజన్ అధికారులు, సిబ్బంది బృందాన్ని ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. ఇది రైళ్ల రాకపోకల సామర్థ్యాన్ని పెంపొందింప చేస్తుందని, రైళ్ల రాకపోకలను సులభతరం చేస్తుందని తెలిపారు.