త్వరలో సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ రైలు

సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ రైలు అతి త్వరలో పట్టాలెక్కనుంది. ఈనెల చివరి వారంలో ఈ రైలు ప్రారంభం కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.  సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వందేభారత్‌ రైలును నడిపేందుకు ద.మ.రైల్వే అధికారులు బీబీనగర్‌, నడికుడి, మిర్యాలగూడ, వరంగల్‌, ఖాజీపేట, కడప, బీబీనగర్‌, గుంటూరు, నెల్లూరు, గూడూరు మూడు రూట్లను పరిశీలించి చివరకు బీబీనగర్‌, నడికుడి, మిర్యాలగూడ మార్గాన్ని దాదాపు ఖరారు చేశారు.
 
ఈ మూడు రూట్లతో పోలిస్తే బీబీనగర్‌, నడికుడి, మిర్యాలగూడ తక్కువ దూరం ఉండటంతో అధికారులు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు.  ఇదిలా ఉండగా, గంటకు 130 నుంచి 150 కి.మీ.ల వేగంతో దూసుకెళ్లే ఈ రైలు ధర రూ.1150 నుంచి ప్రారంభమవుతుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. టికెట్‌ చార్జి, రైలు నంబర్లు ఖరారు కాగానే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేస్తారు.
 
ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి నడుస్తున్న రైళ్లలో నారాయణదాద్రి ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణ సమయం 12 గంటలు పడుతుండగా, వందేభారత్‌ రైలు ప్రయాణం ఆరున్నర గంటల నుంచి 7 గంటలు పడుతుందని పేర్కొంటున్నారు. మరోమారు, ట్రాక్‌ పనులను పరిశీలించి సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడిపే వందేభారత్‌ రైలు తేదీని ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.