పాతబస్తీలో వెలుగులోకి ఉగ్రవాద నిధులు సమకూర్చే వ్యక్తి!

దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా ఏదోఒక రూపంలో మూలాలు హైదరాబాద్ లో బయల్పడుతూ వస్తున్నది. అయితే మొదటిసారిగా, ఉగ్రవాద కుట్రకు నిధులు సమకూర్చే వ్యక్తి దర్యాప్తు అధికారులకు పట్టుబడ్డారు. నగరంలో ఉగ్రవాదులు ఉండటానికి ఓల్డ్ సిటీలోని ఓ వ్యక్తి ఆర్థిక సహాయం అందించినట్లు అధికారులు గుర్తించి షాక్‌కు లోనయ్యారు.
 
పాతబస్తీకి చెందిన అబ్దుల్ కలీమ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇంకా ఎవరైనా ఈకుట్రలో వున్నారా? అనే కోణంలో విచారణ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో నరమేధం సృష్టించేందుకు కుట్రకు పాల్పడిన  జాహెద్‌తో పాటు ముగ్గురిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. జాహెద్‌కు అబ్దుల్ కలీం రూ. 40 లక్షల ఆర్థిక సహాయం చేసినట్లు ఇప్పుడు గుర్తించారు.
 
కలీం ఇచ్చిన రూ. 40 లక్షలతో జాహెద్ కార్లు బైకులు కొనుగోలు చేసినట్, దీంతో జాహీద్ ముఠా విదేశాలనుంచి వచ్చిన హ్యాండ్ గ్రెనైడ్లతో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు, కార్లు బైకులు హ్యాండ్ గ్రానైట్ల పెట్టి పేల్చడానికి కుట్ర పన్నినట్లు గుర్తించారు. దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాదులో జరిగే ఉత్సవాల్లో పేలుడుకు కుట్ర చేసినట్లు పేర్కొన్నారు.
 
గతంలోని కుట్రని పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే. ఇప్పటికే భాగ్య నగర్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన జాహెద్ ముఠాపై ఎన్‌ఐఎ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఎన్‌ఐఎ విచారణ చేపట్టింది. డిసెంబర్ 2022 లో జాహెద్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జాహెద్ ముఠా పేలుడు పదార్థాలను పాకిస్థాన్, నేపాల్ మీదుగా హైదరాబాద్‌కు తరలించింది.
 
దసరా వేడుకల్లో పేలుళ్లు జరపాలని కూడా ఈ ముఠా ప్లాన్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎన్‌ఐఏ తమ దర్యాప్తులో కీలక విషయాలను గుర్తించింది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు నిందితులు ప్లాన్ చేశారు. దేశ అంతర్గత భద్రతకు భంగం కలిగించాలని ఈ ముఠా ప్లాన్ చేసింది. జాహెద్, సమియుద్దీన్, హసన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
 
దసరా వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతలను హత్య చేసేందుకు ఈ ముఠా కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మాహుతి బాంబర్‌కు ఆశ్రయం కల్పించిన కేసులో జాహెద్ 12 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జాహెద్ ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
 దీంతో జాహెద్ పై పోలీసులు నిఘా పెంచారు. హైదరాబాద్ పేలుళ్లకు జాహెద్ కుట్ర పన్నారని తెలుసుకున్న పోలీసులు జాహెద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది.