మోదీ ప్రభుత్వం పడగొట్టడమే జార్జి సోరోస్ లక్ష్యం!

అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జి సోరోస్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మండిపడుతూ భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు.  జార్జి సోరోస్ తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలనుకోవడం ఆయన ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను బద్దలు కొట్టిన వ్యక్, ఆర్థిక యుద్ధ నేరస్థుడిగా పేర్కొనబడిన వ్యక్తి ఇప్పుడు భారత ప్రజాస్వామ్య ప్రక్రియల్లో తన దురుద్దేశాలను బయటపెట్టాడని ఆమె ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ వంటి వారిని టార్గెట్‌గా చేసుకునేందుకే ఆయన బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించినట్టు మంత్రి విమర్శించారు. సొరేన్ అసలు లక్ష్యం ప్రధాని నరేంద్ర మోదీ అని పేర్కొంటూ దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి, తమ ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వాన్ని తీసుకు రావడమే అతని అసలు ఉద్దేశ్యమని స్మ్రితి ఇరానీ ఆరోపించారు. 
భారత్ లో ప్రతి ఐదేళ్లకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నామని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. దేశ ప్రజాస్వామ్యం ఎప్పటికీ చెక్కుచెదరదని ఆమె స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచేందుకు ఎవరెన్ని దుష్ట పన్నాగాలు పన్నినా ప్రధాని మోదీ నాయకత్వంలో బలంగా ఎదుర్కుంటామని ఆమె హెచ్చరించారు.

జార్జి సోరోస్ తన శక్తియుక్తులను భారత్ కు కాకుండా తన దేశానికి లబ్ధి పొందేందుకు ఉపయోగిస్తుంటారని పేర్కొంటూ అదానీ గ్రూప్ అంశంపై ఆయన ఆలోచనా ప్రక్రియ, ప్రకటనలను భారతీయులంతా తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ”ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడంపై ప్రధాని మోదీని అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులతో పాటు, ఇంగ్లాడ్ ప్రధాని బహిరంగంగా ప్రశంసించారు. ఇలాంటి తరుణంలో ఒక సామ్రాజ్యవాద పెట్టుబడిదారు వ్యాఖ్యలు వెలుగుచూశాయి” అని స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 జార్జి సోరోస్ ఎవరికి నిధులు ఇస్తున్నారనే విషయం మీడియా వ్యక్తులందరికీ బాగా తెలుసునని పేర్కొంటూ ఆయన మోదీని లక్ష్యంగా చేసుకున్నారని, భవిష్యత్తులో కూడా ఆయన టార్గెట్ అదే విధంగా ఉండబోతుందని ఆమె చెప్పారు. భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకొనే ప్రయత్నం చేస్తున్న విదేశీ శక్తులకు ఉమ్మడిగా సమాధానం చెప్పాలని ఆమె ఈ సందర్భంగా దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

కాగా, గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో తలెత్తిన అలజడితో స్టాక్ మార్కెట్ కుదేలయిందని, పెట్టుబడి అవకాశాలకు తలుపులు బార్లా తెరిచిన భారత్ పైవిశ్వాసానికి ఇది కుదుపులాంటిందని, మరిన్ని సంస్థాగత సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని జార్జి సోరోస్ (92) పేర్కొన్నారు. భారత్ లో పెట్టుబడిదారుల విశ్వాసానికి విఘాతం కలిగించే విధంగా అదానీపై ఇటీవల హిండెన్ బర్గ్ వ్యాఖ్యలు చేసిన క్రమంలో జార్జి సోరోస్ తాజా వ్యాఖ్యలు చేశారు.

అదానీ వ్యవహారంపై మోదీ మౌనంగా ఉండటాన్ని కూడా జార్జి సోరోస్ ప్రశ్నించారు. విదేశీ పెట్టుబదిదారుల ప్రశ్నలకు, పార్లమెంటులోనూ ఆయన (మోదీ) సమాధానం ఇవ్వాలని కోరారు. ప్రపంచ బిలియనీర్ సోరోస్ ఆస్తి విలువ 8.5 బిలియన్ డాలర్లు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ వ్యవస్థాపకుడు. ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం, వాక్ స్వేచ్ఛను ప్రమోట్ చేసే సంస్థలు, వ్యక్తులకు గ్రాంట్స్ ఇస్తుంటారు.