2030 నాటికి భారత్ లో 2 కోట్ల విద్యుత్​ వాహనాలు

2030 నాటికి దేశంలో 2 కోట్లకు పైగా విద్యుత్ వాహనాలు​ రోడ్ల మీద తిరుగుతాయని, ఫలితంగా కాలుష్యం తగ్గుతుందని, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ స్పష్టం చేశారు. దేశంలో విద్యుత్ వాహనాలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోందని చెబుతూ ముఖ్యంగా గత రెండేళ్లల్లో ఈవీలను కొనుగోలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని తెలిపారు.
 
ఎలక్ట్రిక్​ మొబిలిటీ అండ్​ ఫ్యూటర్​ మొబిలిటీ థీమ్​తో జరిగిన ఓకార్యక్రమంలో పాల్గొంటూ  “2030 నాటికి 2 కోట్లకు పైగా ఈవీలు భారత్ లో తిరుగుతాయి. కాలుష్యం తగ్గడంతో పాటు ఉద్యగాలు పెరుగుతాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధిచెందుతుంది. దేశం ఆత్మనిర్భరంగా మారుతుంది,” అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

సాధారణంగా కాలుష్యంలో శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఉంటాయి. కాలుష్యంలో 40 శాతం వాటా రవాణా రంగానిదని గడ్కరీ తెలిపారు.   దానిని తగ్గించేందుకు కృషిచేస్తున్నట్టు చెబుతూ విద్యుత్ బస్సులను పెంచాలని చూస్తున్నట్టు వెల్లడించారు.

 “ఇంధన దిగుమతి భారత్ కు  పెద్ద సవాలే. దేశ ఆర్థిక వ్యవస్థలోని రూ. 16 లక్షల కోట్లు.. పెట్రోల్​, డీజిల్​ కొనుగోలుకే విదేశాలకు వెళతాయి. ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతే చేసుకుంటుంది భారత్. ఫలితంగా విదేశీ మారక నిల్వల్లో ఎక్కువ మొత్తాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తోంది. విద్యుత్ వాహనాల సంఖ్య పెరిగితే.. ఇది దిగొస్తుంది,” అని నితిన్​ గడ్కరీ తెలిపారు.

ఈవీలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలని పేర్కొంటూ దీని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు సృష్టించుకోవచ్చని సూచించారు. విద్యుత్ వాహనాలపై భారతీయుల ఆసక్తి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిందని చెప్పారు.

ఆటో సంస్థల మధ్య నెలకొన్న పోటీతో ధరలు దిగొస్తుండటం కూడా ప్లస్​ పాయింట్​గా నిలుస్తోంది. 2021తో పోల్చుకుంటే 2022లో ఈవీ సెగ్మెంట్​ 200 శాతం వృద్ధిని సాధించింది! దేశంలో ఈవీ సేల్స్​ 20 లక్షల మైలురాయిని దాటినట్టు కేంద్ర విద్యుత్​శాఖ వెల్లడించింది. కేవలం 6 ఏళ్లలో ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.