సోమనాథ దేవాలయంపై వ్యాఖ్యలకు ముస్లిం మత పెద్ద క్షమాపణ

గుజరాత్‌లోని సోమనాథ దేవాలయంపై మహమ్మద్ ఘజనీ దాడి చేసి, ధ్వంసం చేయలేదని, ఆ దేవాలయంలో జరిగే అనైతిక కార్యకలాపాలను ఆపాడని వ్యాఖ్యానించిన ముస్లిం మత పెద్ద మౌలానా సాజిద్ రషీదీ శుక్రవారం క్షమాపణ చెప్పారు. గురువారం ఆయనపై ఓ కేసు నమోదైంది. ఆయన అఖిల భారత ఇమామ్ సంఘానికి అధ్యక్షుడు కూడా.

మౌలానా రషీదీ గత నెలలో కొన్ని వార్తా చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మహమ్మద్ ఘజనీ సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేయలేదని, అక్కడ జరిగే అనైతిక కార్యకలాపాలను ఆపాడని చెప్పుకొచ్చారు. హిందూ దేవతలు, విశ్వాసాల పేరుతో ఆ దేవాలయంలో అనైతిక కార్యకలాపాలు జరుగుతూ ఉండేవని చరిత్రను బట్టి తెలుస్తోందని చెప్పారు.

ఈ విషయాలను ధ్రువీకరించుకున్న తర్వాత ఘజనీ ఆ దేవాలయంపై దాడి చేశాడని ఆరోపించారు. ఆయన దేవాలయాన్ని ధ్వంసం చేయలేదని, తప్పుడు పనులను మాత్రమే ఆపాడని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 153ఏ, 295ఏ ప్రకారం ప్రభాస్ పటాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారని, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ద్వేషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు నమోదయ్యాయి. శ్రీ సోమనాథ్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ విజయ్ సింహ్ చావ్డా ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు.

గిర్ సోమనాథ్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మనోహర్ సింహ్ జడేజా విలేకర్లతో మాట్లాడుతూ, మౌలానా రషీదీ గతంలో కూడా ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు తమకు తెలిసిందని, దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రభాస్ పటాన్‌లో ఉన్న సోమనాథ్ దేవాలయాన్ని 11వ శతాబ్దం తర్వాత ముస్లిం రాజులు అనేకసార్లు ధ్వంసం చేశారు. దీనిని స్వాతంత్ర్యానంతరం పునర్నిర్మించారు.

ఓ వార్తా సంస్థ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, రషీదీ మాట్లాడుతూ, తాను రోమిలా థాపర్ రాసిన పుస్తకాన్ని చదివానని, దాని ఆధారంగా తాను ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఇతరులను బాధించాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు.  సోమనాథ్ దేవాలయం ట్రస్టీలకు క్షమాపణ చెప్తున్నానని తెలిపారు. ఈ దేశాన్ని ముస్లింలు 800 సంవత్సరాలపాటు పరిపాలించారని, వారు దేవాలయాలకు భూములను విరాళంగా ఇచ్చారని, వాటిని అందంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.