భారత పౌరసత్వానికి 2011 నుండి 16 లక్షల మంది స్వస్తి!

గత ఏడాది 2.25 లక్షల మంది ప్రజలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత పదేళ్లలో ఇదే గరిష్ఠ సంఖ్య. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది. 2011 నుంచి 16 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలిపింది.  గత ఏడాది అత్యధికంగా 2,25,620 మంది, 2020లో అత్యల్పంగా 85,256 మంది భారతీయ పౌరసత్వాన్ని వీడినట్లు వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిచ్చారు. ఏడాది వారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్యను వివరించారు.

విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923 మంది, 2013లో 1,31,405 మంది, 2014లో 1,29,328 మంది, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.

 2022 లో ఈ సంఖ్య 2,25,620కు పెరిగినట్లు చెప్పారు. 2011 నుంచి భారత పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయుల సంఖ్య 16,63,440గా పేర్కొన్నారు. మరోవైపు గత మూడేళ్లలో ఐదుగురు భారతీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌరసత్వాన్ని పొందినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే భారతీయులు పౌరసత్వం పొందిన 135 దేశాల జాబితాను కూడా ఆయన వెల్లడించారు.