మంగళగిరి పుష్కరిణిలో బయటపడ్డ పురాతన శివలింగాలు

గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రసిద్ధి చెందిన శ్రీ పానకాల లక్ష్మీనృసింహస్వామి పుష్కరిణి (పెదకోనేరు) మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో 464 ఏళ్ల నాటి రెండు శివలింగాలు బయటపడ్డాయి. వంద అడుగుల మేర నీటిని తోడగా శివలింగాలు, ప్రపత్తి ఆంజనేయస్వామి ఆలయం కనిపించాయి.  ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో ఛైర్మన్‌ గంజి చిరంజీవి, అధికారులు పరిశీంచారు. శివ లింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊట మాత్రం పెద్దఎత్తున వస్తుండటంతో అధికారులు నిత్యం నీటిని తోడుతూనే ఉన్నారు.
 
మంగళగిరి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో శిథిలావస్థకు చేరిన కోనేరుకు రూ.1.5కోట్లతో దేవాదాయశాఖ మరమ్మతులు చేస్తోంది. దశాబ్దాల తరబడి ఉన్న నీటి తొలగింపు పనులు చేపట్టారు. పుష్కరిణిలో ఉన్న నీళ్లను మోటార్ల ద్వారా బయటకు తోడుతున్నారు. 2004లో కోనేరు చుట్టూ రక్షణ గోడ నిర్మించారు. పుష్కరిణి శిథిలావస్థకు చేరడంతో దేవాదాయశాఖ మరమ్మతులు చేస్తోంది. కోనేరు మెట్లను పునరుద్ధరించి. మిగిలిన పనుల్ని చేపట్టారు.
 
చారిత్రక ఆధారాల ద్వారా ఈ కోనేటిని క్రీ.శ.1558లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి సదాశివరాయులు మేనల్లుడు తిమ్మరాజయ్య నిర్మించినట్లు ఆనవాళ్లు చెబుతున్నాయి. ఈ పుష్కరిణి నాలుగు వైపులా రాతిమెట్లు, ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. అలాగే రెండు బావులు ఉన్నట్లు స్థానికంగా చెబుతుంటారు.  కోనేటిలో నీటిని శ్రీలక్ష్మినృసింహస్వామికి అభిషేకానికి వినియోగించేవారు. కోనేటి గర్భంలో బంగారు గుడి ఉందని ప్రచారం ఉంది. ఇటు పుష్కరణిలో దాసాంజనేయ ఆలయం కూడా ఉంది. గతంలో కోనేటిని పునరుద్ధరించే ప్రయత్నం చేసినా నీళ్ల ఊట వస్తుండటంతో కుదరలేదు.