ఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు రాకుండా చేస్తాం

దమ్ముంటే 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం నేతలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎంఐఎం ఎక్కడ పోటీ చేసినా ఆ పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు రాకుండా చేస్తామని ఆయన స్పష్టం చేశారు.  ప్రజల్లో హిందుత్వ వాతావరణం వచ్చిందని, 80 శాతం జనాభా ఉన్న హిందువులంతా ప్రత్యేక ఓటు బ్యాంక్‌గా మారబోతున్నారని చెబుతూ అందుకే ఎంఐఎంతో సంబంధం లేదన్నట్లు బిఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు.

హిందూ దేవీదేవతలను కించపరిస్తే ముందుగా స్పందించేది బిజెపి మాత్రమేనని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని చెబుతూ ఆ పార్టీకి ఓటువేస్తే బిఆర్ఎస్ కు ఓటు వేసిన్నట్లే అని  స్పష్టం చేశారు. అయితే, అన్ని పార్టీలు కలిసి బిజెపిని ఓడించే కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏదేమైనా వెనుకంజ వేసేది లేదని తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తెచ్చి రామరాజ్యం స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో నలుగురు జిల్లా కలెక్టర్లు ధరణి పేరుతో అడ్డగులుగా సంపాదించి కేసీఆర్ కుటుంభానికి దోచిపెడుతున్నారని సంజయ్ డజమెత్తారు. త్వరలోనే వారి బండారాన్ని బయటపెడతామని వెల్లడించారు. బిజెపి అధికారంలోకి వస్తే అటువంటి వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.

 మంగళవారం హైదరాబాద్ శివారు మన్నెగూడలో బిజెపి శక్తి కేంద్రాల సభలో పాల్గొనే వక్తల వర్క్‌షాప్ ముగింపు ససభలో పాల్గొన్న సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి ఈనెల 10 నుంచి 25 వరకు దేశంలో చరిత్ర సృష్టించే విధంగా శక్తి కేంద్రాల పరిధిలో 11 వేల కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతుందని తెలిపారు. బిజెపిలో కొత్త నాయకులను తయారుచేయాలనే లక్షంతో ఈ మీటింగ్స్ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

కార్నర్ మీటింగ్‌లలో బిజెపికి తెలంగాణలో ఎందుకు అధికారం ఇవ్వాలనే అంశంపై చర్చ జరగుతుందని చెప్పారు. వాజ్‌పేయి, అద్వానీ వంటి నేతలు స్ఫూర్తితో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో చరిత్రలో ఏడాదికి 15 బహిరంగ సభలను నిర్వహించిన ఘతన బిజెపికే దక్కుతుందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో బిజెపి తప్పితే ఇతర పార్టీలకు క్షేత్రస్థాయిలో మీటింగ్‌లు పెట్టే దమ్ములేదని ఎద్దేవా చేశారు. 11వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు అనంతరం అసెంబ్లీల వారీగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తామని తెలిపారు.