మద్యం కుంభకోణంలో కవిత మాజీ ఆడిటర్ అరెస్ట్

రాజకీయ కలకలం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం పలు మలుపులు తిరుగుతూ, పలు సందర్భాలలో సీఎం కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత వైపుకు వెడుతున్నది. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లలో ఇందులో ఆమె ప్రమేయం గురించి స్పష్టంగా పేర్కొన్నారు.
 
తాజాగా,  హైదరాబాద్‌కు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఆయనను ఢిల్లీకి తరలిస్తున్నారు. గతంలో బుచ్చిబాబు ఇంట్లో సీబీఐ సోదాలు జరపగా.. ఢిల్లీకి పిలిపించి పలుమార్లు ప్రశ్నించింది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది.
 
ఢిల్లీకి తరలించిన అనంతరం రౌస్ రెవెన్యూ స్పెషల్ కోర్టులో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. విచారణ కోసం కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరనున్నారు. ఢిల్లీ మద్యం విధానంలో ఆడిటర్ బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ గుర్తించింది.
 
 అందులో భాగంగానే ఆయన ఇంట్లో సోదాలు జరపడంతో పాటు పలుమార్లు విచారించింది. ఇప్పుడు ఆయన పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియడంతో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైకి ఛార్టెడ్ అకౌంటెంట్‌గా బుచ్చిబాబు పనిచేశారు
 
అలాగే గతంలో కవితకు కూడా బుచ్చిబాబు ఛార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆయన అరెస్ట్‌తో కవితకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవని ప్రచారం సాగుతోంది. కవితకు అత్యంత సన్నిహితుడిగా బుచ్చిబాబు ఉన్నారనే ప్రచారం ఉంది.  ఇప్పటికే కవితను ఈ కుంభకోణంలో సీబీఐ ప్రశ్నించడంతో పాటు ఇటీవల ఛార్జిషీట్‌లో ఆమె పేరును కూడా చేర్చింది. ఇలాంటి తరుణంలో బుచ్చిబాబు అరెస్ట్ బీఆర్ఎస్ వర్గాలకు టెన్షన్ పుట్టిస్తోంది. బుచ్చిబాబు అరెస్ట్‌తో త్వరలో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశముందని వార్తలొస్తున్నాయి.