గగనతలంపై టర్కీకి సహాయ సామగ్రి అనుమతించని పాక్

భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతూ పాకిస్థాన్  మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. వరుస భూకంపాలతో అతలాకుతలమైన తుర్కియేకు సహాయక సామగ్రితో బయలుదేరిన భారత ఎన్‌డీఆర్ఎఫ్ విమానానికి ఎయిర్‌స్పేస్ ఇచ్చేందుకు పాకిస్థాన్ నిరాకరించింది.

తుర్కియేలో జరిగిన విలయానికి ప్రపంచం మొత్తం కదిలిపోయింది. భారత్ సహా అనేక దేశాలు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ తుర్కియేకు సాయం అందిస్తామని ప్రకటించిన వెంటనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. భారత నుంచి తొలి విడత సహాయక సామగ్రితో ఎన్‌డీఆర్ఎఫ్ విమానం ఉత్తరప్రదేశ్‌లోని హిండోన్ ఎయిర్‌ బేస్ నుంచి మంగళవారం ఉదయం తుర్కియేకు బయలుదేరింది.

ఇందులో 100 మందితో కూడిన రెండు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు, ప్రత్యేక శిక్షణ పొందిన శునకాలు, ఔషధాలు, ఇతర అత్యవసర పరికరాలు ఉన్నాయి. అత్యవసరంగా బయలుదేరిన ఈ విమానానికి తన గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్థాన్ నిరాకరించి తన అల్పబుద్ధిని బయటపెట్టుకుంది.

విపత్కర సమయంలో మరింతగా స్పందించాల్సింది పోయి ఇలా సహాయక కార్యక్రమాలు ఆలస్యమయ్యే పరిస్థితిని తీసుకొచ్చి భారత్‌పై తనకున్న అక్కసును ఇలా బయటపెట్టుకుంది. దీంతో భారత విమానం మరో మార్గం ద్వారా తుర్కియే చేరుకుని అదానా సకిర్పాసా విమానాశ్రయంలో ల్యాండైంది.

భారత విమానానికి తమ ఎయిర్‌స్పేస్ నిరాకరించడం పాకిస్థాన్‌కు ఇదేమీ కొత్తకాదు. గతంలో ఆఫ్ఘనిస్థాన్‌ కు భారత్ మానవతా సాయం కింద 50 వేల టన్నుల గోధుమలను పంపిస్తున్నప్పుడు కూడా పాకిస్థాన్ ఇలాగే తమ ఎయిర్‌స్పేస్ వాడుకునేందుకు నిరాకరించింది. పాకిస్థాన్ తీరుపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. ఇలాంటి విపత్కర సమయాల్లోనూ నీచ రాజకీయాలు ఏంటంటూ దునుమాడుతున్నాయి.

ప్రధాని మోదీ భావోద్వేగం

టర్కీ, సిరియాలలో సోమవారం సంభవించిన భూకంపాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2001లో గుజరాత్‌లో సంభవించిన భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
 
గుజరాత్ భూకంపం వల్ల దాదాపు 13 వేల మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే కారణంతో టర్కీ ప్రజల కష్టాలను మోది అర్థం చేసుకోగలరని బిజెపి ఎంపీ మనోజ్ తివారి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.