తెలంగాణ విద్యుత్ బకాయిల చెల్లింపుకై ఏపీ పట్టు

ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చెల్లించకుండా జాప్యం చేస్తున్న విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లినచ్చని కోరుతూ ఏపీ ప్రభుత్వం పట్టుబడుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ కు  చెల్లించాల్సిన రూ. 3,441.78 కోట్ల విలువైన విద్యుత్‌ బకాయిలను చెల్లించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.
 
బకాయిలను క్లియర్‌ చేయడంలో తెలంగాణ వైపు నుండి విపరీతమైన జాప్యం జరిగిందని, దీని ఫలితంగా గత ఏడేళ్లలో దాదాపు రూ.4,000 కోట్లకు ఈబకాయిలు పెరిగాయని ఆలేఖలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.3,441.78 కోట్ల బకాయిల్లో అసలు మొత్తానికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని ఏపీ జెన్‌కో అధికారులు చెబుతున్నారు.
 
ఏపీ జెన్‌కో, టీఎస్‌ డిస్కమ్‌ల నుండి ఉన్నతాధికారులు ఒక ఒప్పందంపై సంతకం చేశారని, దీని ఆధారంగా, టీఎస్‌ డిస్కమ్‌లు వెంటనే ఏపీ జెన్‌కోకు అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు.  రూ.3,441.78 కోట్ల అసలు బకాయిపై 15 శాతం వార్షిక వడ్డీ రేటు విధిస్తున్నందున, ఆలస్య చెల్లింపు ఛార్జీలు ఇప్పటికి దాదాపు రూ.4,000 కోట్లకు పెరిగాయని ఏపీ జెన్‌కో పేర్కొంది.
 
అసలు మొత్తం చెల్లించడంలో జాప్యం, ఎక్కువ ఆలస్య అయినందుకు అపరాధ వడ్డీ చెల్లింపు ఛార్జీలు వెరసి ఇది తెలంగాణ ప్రభుత్వంపై మరింత ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని ఏపీ జెన్‌కో తెలిపింది. అంతేకాకుండా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ నుండి విద్యుత్‌ ఉత్పత్తి, టీఎస్‌ డిస్కమ్‌లకు సరఫరా చేయడానికి ఏపీ జెన్‌కో తీసుకున్న రుణాన్ని కూడా ఈలేఖలో ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. ఇందుకోసం ఏపీ జెన్‌కో తన ఫైనాన్షియర్లకు 11.5 శాతం చొప్పున నెలవారీ చక్రవడ్డీని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. టీఎస్‌ ప్రభుత్వం తన విద్యుత్‌ బకాయిలను, కనీసం అసలు మొత్తాన్ని క్లియర్‌ చేస్తే, ఫైనాన్షియర్‌లకు తమ బకాయిలను క్లియర్‌ చేయడానికి ఎంతగానో సహాయం చేస్తుంది అని ఏపీ జెన్‌కో తెలిపింది.

ఇదిలా ఉండగా, 2023 జనవరి మొదటి వారంలో మూడుసార్లు లిస్టింగ్‌ చేయబడినప్పటికీ, సమయాభావం కారణంగా టీ-ఎస్‌ డిస్కమ్‌ల నుండి ఏపీ జెన్‌కోకు విద్యుత్‌ బకాయిలపై విచారణపై తెలంగాణ హైకోర్టులో వాయిదా పడింది.