ముంబైలోని కేవీఐసీలో ఖాదీ ఫెస్ట్ 2023 ప్రారంభం

 
ముంబై లోని కేవీఐసీ ప్రధాన కార్యాలయంలో ఖాదీ ఫెస్ట్ 2023 ప్రారంభమయ్యింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరిగే ప్రదర్శనను  కేవీఐసీ చైర్మన్ మనోజ్ కుమార్ ప్రారంభిస్తూ దేశంలో వెనుకబడిన, పేద వర్గాలకు చెందిన ప్రజలకు జీవనోపాధి కల్పించే బాధ్యతను  కేవీఐసీ  స్వీకరించిందని తెలిపారు.
 
ప్రదర్శనలు, ఎగ్జిబిషన్ ద్వారా వేలాది మంది చేనేత కళాకారులు ఉత్పత్తి చేస్తున్న వస్తువులు ప్రజలకు పరిచయం అవుతాయని, దీని ద్వారా ఖాదీ సంస్థలు,పీఎంఈజిపి, ఎస్ ఎఫ్ యు ఆర్ టి ఐ లాంటి సంస్థలు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో  మాత్రమే కాకుండా విదేశాలలో కూడా జరగాలని ఆయన సూచించారు.
 
ఖాదీ, గ్రామీణ వస్తువులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన కనిపించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి పిలుపు తర్వాత వస్తువుల అమ్మకాలు పెరిగాయని వివరించారు. `స్థానికులకు సాధికారత, స్థానికం నుంచి ప్రపంచానికి చేరాలి ‘అన్న ప్రధానమంత్రి కలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
 
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన స్థితిగతులు మెరుగు పరిచేలా విధులు నిర్వహించాలని సంస్థ ఉద్యోగులకు మనోజ్ కుమార్ సూచించారు.   ఢిల్లీలో నవంబర్ నెలలో జరిగిన ఐఐటిఎఫ్ -22 లో రికార్డు స్థాయిలో ఖాదీ అమ్మకాలు జరిగాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ 2న ఢిల్లీ ఖాదీ ఇండియా అవుట్ లెట్ ఒకే రోజున 1.34 కోట్ల రూపాయల వ్యాపారం సాగించి సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన వివరించారు.
 
గత ఏడాది దేశంలో రూ. 1.15 లక్షల కోట్ల విలువ చేసే ఖాదీ, గ్రామీణ ఉత్పత్తుల వ్యాపారం జరిగింది. ఖాదీ ఫెస్ట్22 లో రూ. 3.03 కోట్ల విలువ చేసే విక్రయాలు జరిగాయని ఆయన వివరించారు.   ఖాదీ వస్తువులను గుర్తించి గౌరవించి కొనుగోలు చేయాలని  మనోజ్ కోరారు.
 
 కార్యక్రమంలో నాగాలాండ్ కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత నీహునునో సోర్హి, కేరళకు చెందిన వి.పీ. అప్పుకుట్టాన్ లను సన్మానించారు.  ఈ ఖాదీ ఫెస్ట్ లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఇన్ స్టిట్యూషన్స్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కు అనుబంధంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పీఎంఈజీపీ యూనిట్లు తమ ఉత్పత్తులను ప్రదర్శన, అమ్మకాల కోసం ప్రదర్శిస్తున్నాయి.