తెలుగు రాష్ట్రాల్లో ‘వందే భారత్’కు అనూహ్య స్పందన

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంక్రాంత్రి పండుగ రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ కు అనూహ్య స్పందన లభిస్తున్నది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ రైలులో  సీట్ల వినియోగం100 శాతం కంటే ఎక్కువ నమోదయినట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

ఇది ప్రారంభమైన మూడు రోజుల్లో అనుకున్న దానికన్నా అదనంగా ఆక్యుఫెన్సీని నమోదు చేసిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈ రైలులో ప్రయాణించడానికి ప్రయాణికులు అధికంగా ఆసక్తిని కనబరుస్తున్నారని దక్షిణమధ్య రైల్వే పేర్కొంది.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ల మధ్య ప్రయాణానికి, మొదటి మూడు రోజులు (జనవరి 16, 17,18) సగటు ఆక్యుపెన్సీ మొదటి రోజు 99 శాతం నమోదు కాగా, రెండో రోజు 144 శాతం, మూడో రోజు 149 శాతంగా నమోదయ్యింది.

అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంల మధ్య ప్రయాణానికి, మొదటి మూడు రోజులు సగటు ఆక్యుపెన్సీ మొదటి రోజు 122 శాతంగా, రెండో రోజు147 శాతంగా, మూడో రోజు 117 శాతంగా నమోదయ్యిందని అధికారులు తెలిపారు. ఈ రైలులో 14 ఏసి చైర్ కార్ కోచ్‌లు (1024 సీట్లు ) 02 ఎగ్జిక్యూటివ్ ఎసి చైర్ కార్ కోచ్‌లు (104 సీట్లు) మొత్తం 1128 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది.

ఈ రైలు ప్రారంభం, తుది స్టేషన్‌లతో పాటు మధ్య స్టేషన్‌లు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో పగలు ప్రయాణానికి అత్యంత ప్రాధాన్య ఎంపికగా మారుతోంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య అందుబాటులో ఉన్న అనేక రైళ్లకన్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండుస్టేషన్ల మధ్య దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర గంటల వ్యవధిలో గమ్యాన్ని చేరుకుంటుంది.

పగటిపూట తరచుగా ప్రయాణించే వ్యక్తులు, తక్కువ వ్యవధిలో ప్రయాణాలు తలపెట్టే ప్రయాణికులకు ఈ ఎక్స్‌ప్రెస్ రైలు అనుకూలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో ఆధునిక హంగులతో, విమాన తరహా ప్రయాణం అనుభూతిని పొందే విధంగా మెరుగైన సౌకర్యాలతో ఈ రైలును తయారు చేశారు.

ఈ రైలులో తలుపులు వాటి అంతటా అవే తెరుచుకోవడం, మూసుకునే విదంగా ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్‌ల వ్యవస్థను కలిగి ఉంది. అన్ని తరగతులలో ఏటవాలు సీట్లు ఉండగా ఎగ్జిక్యూటివ్ తరగతిలో 180 డిగ్రీల కోణంలో తిరిగే సీట్లను అమర్చారు.