పాకిస్థాన్కి చెందిన లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహమాన్ మక్కిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’ గా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) ఎట్టకేలకు ప్రకటించింది. ఐఎస్ఐఎల్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేర్చినట్లు యుఎన్ఎస్సి తెలిపింది.
జమ్ము కాశ్మీర్లో నిధుల సేకరణ, యువతను హింసలో భాగస్వామ్యులను చేయడం, దాడులకు కుట్ర పన్నడంతో దేశీయ చట్టాల ప్రకారం భారత్ మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. మక్కీని ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ జాబితాలో చేర్చాలని గతేడాది జూన్లో భారత్ యుఎన్ఎస్సిలో ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనను ‘నో ఆబ్జక్షన్ విధానం’ కింద కమిటీలోని 15 సభ్యదేశాలకు పంపింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా టెక్నికల్ హోల్డ్లో ఉంచింది. భద్రతా మండలి విధి విధానాల ప్రకారం దీన్ని ఆరు నెలల వరకు కొనసాగించవచ్చు. ఈ క్రమంలో చివరకు యుఎన్ఎస్సీ సోమవారం మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
లష్కరే తొయిబా చీఫ్, 26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్కి బావ అయిన మక్కీ లష్కరే తొయిబాలో వివిధ నాయకత్వ పదవులను నిర్వహించాడు. అలాగే లష్కరే తొయిబా కార్యకలాపాల కోసం నిధుల సేకరణలో కీలక పాత్ర పోషించారు. 2020లో పాకిస్థాన్ తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం మక్కీని ఉగ్రవాదానికి నిధులు సేకరణ కేసులో నిందితునిగా నిర్థారించడంతో పాటు ఏడాది పాటు జైలుశిక్ష విధించింది.
భద్రతా మండలి నిర్ణయాన్ని భారత్ స్వాగతిస్తూ ఉగ్రవాదం విషయంలో భారత్ తన `జీరో టాలరెన్స్’ విధానాన్ని కొనసాగిస్తుందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో (దక్షిణాసియా) ఉగ్రవాద సంస్థల నుండి ముప్పు తీవ్రంగా ఉందని పేర్కొంటూ భద్రతా మండలి ఆ విధంగా ప్రకటించడం, ఆంక్షలు విధించడం అటువంటి ప్రమాదాలను కట్టడి చేయడంలో, ఉగ్రవాదాన్ని నిర్ములించడంలో విశేషంగా తోడ్పడుతుందని భారత్ స్పష్టం చేసింది. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి గత ఏడాది చైనా అడ్డుపడటం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే.
More Stories
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్
భారత్ కు బంగ్లాదేశ్ లో టి20 మహిళా క్రికెట్ సిరీస్
ఇజ్రాయిల్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్న టర్కీ