శ్రీలంకపై భారత్ క్వీన్ స్వీప్ తో ప్రపంచ రికార్డు

శ్రీలంకపై భారత్ క్వీన్ స్వీప్ చేసింది. తిరువనంతపురంలో శ్రీలంకపై 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా వన్డే క్రికెట్‌ చరిత్రలో ప్ర‌పంచ‌ రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్‌ అవతరించింది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డ్ న్యూజిలాండ్ పేరు మీద ఉంది. కివీస్ జట్టు ఐర్లాండ్‌పై 290 పరుగుల తేడాతో విజ‌యం సాధించింది.. ఇక 275 ప‌రుగుల విజ‌యంతో ఆస్ట్రేలియా, 272 ప‌రుగుల‌తో సౌతాఫ్రికాలు ఉన్నాయి. కాగా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ద‌క్కింది.
 
 అలాగే మూడే వ‌న్డేల సిరీస్ లో రెండు శ‌త‌కాలు సాధించిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను కూడా అందుకున్నాడు. మూడో వ‌న్డే లో శ్రీలంక ఘోర ప‌రాజ‌యం పొందింది. భార‌త్ నిర్దేశించిన 371 ప‌రుగుల ల‌క్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 73ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.. దీంతో భార‌త్ 317 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది..
 
శ్రీలంక బ్యాట‌ర్ అసెన్ బండారా ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ‌టంతో బ్యాటింగ్ కు రాలేదు.. కాగా, టీమిండియా నిర్దేశించిన 391 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగుల వద్ద ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (1)ను సిరాజ్ వెనక్కి పంపాడు.  ఆ తర్వాత మరింతగా చెలరేగిన సిరాజ్ మ‌రో బ్యాట‌ర్ నువనిదు ఫెర్నాండో (19)ను బౌల్డ్ చేశాడు. అదే ఊపుతో కుశాల్ మెండిస్ (4), వనిందు హసరంగ (1)లను పెవిలియన్ పంపాడు. చరిత్ అసలంక (1)ను షమీ అవుట్ చేశాడు. అలాగే, చమిక కరుణ రత్నె(1). సిరాజ్ బౌలింగులోనే రనౌట్ అయ్యాడు.
 
కెప్టెన్ స‌న‌క‌ను 11 ప‌రుగుల‌కు కుల‌దీప్ బౌల్డ్ చేశాడు..దునీత్ ను 3 ప‌రుగుల‌కు ష‌మీ పెవిలియ‌న్ కు చేర్చాడు. ఇక తొమ్మిది ప‌రుగులు చేసిన ల‌హిరి కుమారాను కుల‌దీప్ ప‌డగొట్టాడు.. భార‌త్ బౌల‌ర్ల‌లో సిరాజ్ కు నాలుగు వికెట్లు ల‌భించ‌గా, ష‌మీ,కుల‌దీప్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. శ్రీలంక ప‌త‌నం కేవ‌లం 22 ఓవ‌ర్ల‌లోనే కావ‌డం విశేషం. అంతకుముందు శుభమన్ గిల్ (116), కోహ్లీ (166, నాటౌట్) సెంచరీలతో విరుచుకుపడడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది.
మూడు మ్యాచ్ సిరీస్ లో అన్నింటిని గెలిచిన భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది.  కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. తొలుత శుభ్‌ మాన్‌ గిల్‌ (116) సెంచరీ కొట్టాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 42, శ్రేయాస్‌ అయ్యర్‌ 38, కేఎల్‌ రాహుల్‌ 7, సూర్యకుమార్‌ యాదవ్‌ 4 పరుగులకే అవుటయ్యారు.
 
ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీ మరో మైలురాయి అధిగమించాడు. వన్డేల్లో శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దనే రికార్డును బ్రేక్‌ చేశాడు. జయవర్దనే 418 ఇన్నింగ్స్‌ల్లో 12,650 రన్స్‌ చేశాడు. కోహ్లీ 267 ఇన్నింగ్స్‌ల్లోనే 12,651 రన్స్‌ స్కోర్‌ చేశాడు. దాంతో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అదే విధంగా వన్డేల్లో విరాట్‌కు ఇది 46 సెంచరీ. ఇక ఓవరాల్‌గా ఇప్పటివరకు విరాట్‌ కోహ్లి కెరీర్‌లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం.