ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ అయిన ఎంవీ గంగా విలాస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు వారణాసిలో టెంట్ సిటీని ప్రారంభించడంతో పాటు రూ.1000 కోట్ల విలువైన అనేక ఇతర అంతర్గత జలమార్గాల ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.
భారత్లో మీరు ఊహించగలిగేవన్నీ ఉన్నాయని, ఇది మీ ఊహకు మించినదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. భారతదేశాన్ని మాటల్లో నిర్వచించలేమన్న ఆయన… దీన్ని మన మనసు ద్వారానే అనుభూతి చెందగలమని పర్యాటకులకు ప్రధాని మోదీ చెప్పారు.
గంగావిలాస్ ప్రారంభం పర్యాటక రంగంలో కొత్త యుగానికి నాంది పలుకుతుందని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఇతర మంత్రులు,వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గంగా నదిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్ ప్రారంభం కావడం ఒక మైలురాయి అని ప్రధాని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలో పర్యాటక రంగానికి కొత్త యుగానికి నాంది పలుకుతుందని మోదీ స్పష్టం చేశారు. ఎంవీ గంగా విలాస్లో ప్రయాణిస్తున్న పర్యాటకుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తుందని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.
బక్సర్, ఛప్రా, పాట్నా, ముంగేర్, సుల్తాన్గంజ్,కహల్గావ్ మీదుగా వెళ్లే క్రూయిజ్లో పర్యాటకులకు ప్రతి ఓడరేవు వద్ద సంప్రదాయ స్వాగతం పలికి చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు తీసుకువెళతామని తేజస్వీ యాదవ్ చెప్పారు.
ఈ గంగా విలాస్ భారతదేశ మొట్టమొదటి నదీ పర్యటక నౌక. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌకగా కూడా ఖ్యాతిని గడించింది. ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పాటు సూట్ గదులు, స్పా, జిమ్ సెంటర్లు, ఫ్రెంచ్ బాల్కనీలు, ఎల్ఈడీ టీవీలు, సేఫ్లు, స్మోక్ డిటెక్టర్లు, కన్వర్టిబుల్ బెడ్లు వంటివి కూడా ఉన్నాయి.
51 రోజుల పాటు సాగే పర్యటన
51 రోజుల పాటు సాగే తన మొదటి పర్యటనను వారణాసి నుంచి ఈ రోజే ప్రారంభించనున్న ఎంవీ గంగా విలాస్ .. భారత్లోని ఐదు రాష్ట్రాలను, బంగ్లాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3,200 కి.మీ దూరం ప్రయాణించి దిబ్రూఘర్ చేరుకుంటుంది. అంతేకాక 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ నౌక ప్రయాణించనుంది.
ఇక ఈ నౌక తన మొదటి పర్యటనలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్లు, బీహార్లోని పాట్నా, జార్ఖండ్లోని సాహిబ్గంజ్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, బంగ్లాదేశ్లోని ఢాకా, అస్సాంలోని గువాహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంది. ఎంవీ గంగా విలాస్ తన తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్కు చెందిన 32 మంది పర్యాటకులను తీసుకెళ్లనుంది.
క్రూయిజ్లో స్పా, సెలూన్, జిమ్ వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి రోజుకు రూ. 25,000 నుండి రూ. 50,000 ఖర్చవుతుందని, 51 రోజుల ప్రయాణానికి మొత్తం ఖర్చు ఒక్కో ప్రయాణికుడికి దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని క్రూయిజ్ డైరెక్టర్ రాజ్ సింగ్ తెలిపారు.
ఈ క్రూయిజ్లో కాలుష్య రహిత వ్యవస్థ, శబ్ద నియంత్రణ సాంకేతికత అమర్చబడిందని స్పష్టం చేశారు. ఈ క్రూయిజ్లో మురుగునీరు గంగలోకి ప్రవహించకుండా మురుగునీటి శుద్ధి కర్మాగారం ఉందని, అలాగే స్నానం, ఇతర అవసరాల కోసం గంగాజలాన్ని శుద్ధి చేసే ఫిల్ట్రేషన్ ప్లాంట్ ఉందని రాజ్ సింగ్ చెప్పారు.
More Stories
ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు చెందేలా చేస్తాం
కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు
రక్షణ, వాణిజ్య రంగాల్లో చైనా, రష్యా మరింత సహకారం